Revanth Reddy Tour: స్వేచ్ఛ బ్యూరో: సీఎం రేవంత్రెడ్డి అమెరికా,బ్రిటన్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఈ నెల 20 నుంచి 30 వరకు యూకే, అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు అక్కడ జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి లండన్కు బయలుదేరనున్నారు. ఆ దేశాల్లో ఉన్న పలు వర్సిటీలను సందర్శించనున్నారు.
లండన్లో కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం సమావేశం..
అలాగే అక్కడి వర్సిటీ బృందాలతో సమావేశం కానున్నారు. లండన్లో పర్యటన అనంతరం రేవంత్ రెడ్డి అమెరికాకు వెళ్తారు. ఇక ఆగస్టు 21న లండన్లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను సీఎం సందర్శించనున్నారు. అక్కడి ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్బాల్ ప్రజెంటేషన్లో సీఎం పాల్గొననున్నారు. ఆగస్టు 22న లండన్లో కేంబ్రిడ్జ్ బృందంతో సీఎం సమావేశం కానున్నారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్లోని సెనేట్ హౌస్ను సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్కు వెళ్తారు. ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్కు బయలుదేరతారు.
అమెరికా లో సీఎం టూర్ ఇలా..
ఆగస్టు 24న బోస్టన్లో ఉదయం 10.30 గంటలకు హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్ను సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్కు వెళ్తారు. ఆగస్టు 25న ఉదయం 10.30 గంటలకు బోస్టన్లో నార్త్ ఈస్టర్న్ క్యాంపస్ను సందర్శిస్తారు. ఆరోజు సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం అవుతారు. అలా రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి సీఎం పయనమవుతారు. ఆగస్టు 26న న్యూయార్క్లో రాత్రి 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆగస్టు 30న సీఎం హైదరాబాద్ కు చేరుకుంటారు.