Onion Price vs Sugar Price| దేశంలో ఉల్లిపాయలు, చక్కెర ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్య తరగతి కుటుంబ బడ్జెట్పై అదనపు భారం పడుతోంది. అయితే ఈ రెండు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వేర్వేరు విధానాలను అనుసరిస్తోంది. ఉల్లిపాయల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం.. నాఫెడ్ (NAFED) వద్ద ఉన్న నిల్వలను మార్కెట్లోకి తక్కువ ధరకు విడుదల చేస్తోంది. కానీ చక్కెర విషయంలో వినియోగదారులకు ఇలాంటి ప్రత్యక్ష ఉపశమనం కనిపించడం లేదు.
కొన్ని మార్కెట్లలో ఉల్లిపాయ ధర కిలోకు రూ.60 నుంచి 70 వరకు చేరింది. దీంతో ప్రభుత్వం నాఫెడ్ నిల్వల్లో ఉన్న ఉల్లిపాయలను నగరాల్లో విక్రయించేందుకు చర్యలు చేపడుతోంది. కాందా ఎక్స్ప్రెస్ వంటి పథకాల ద్వారా వినియోగదారులకు కిలో ఉల్లిపాయలను సుమారు రూ.35కే అందించే ప్రయత్నం జరుగుతోంది. మార్కెట్లో సరఫరా పెంచడం ద్వారా ధరలను తగ్గించడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం.
చక్కెర ధరలు కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో ధరలు వివిధ ప్రాంతాలను బట్టటి సుమారు రూ.58 నుంచి దాదాపు రూ.70 వరకు పెరిగినట్లు సమాచారం. అయినప్పటికీ, ఉల్లిపాయల లాగే తక్కువ ధరకు చక్కెరను నేరుగా విక్రయించే దేశవ్యాప్త చర్యను ప్రభుత్వం చేపట్టలేదు. సాధారణంగా నిల్వ పరిమితులు, నెలవారీ విడుదల కోటాలు వంటి చర్యల ద్వారా సరఫరాను నియంత్రిస్తోంది.
మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో చక్కెర పరిశ్రమకు పెద్ద స్థానం ఉంది. ఈ రంగంలో సహకార, ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో రాజకీయ నాయకులకు వాటాలు ఉన్నాయని విమర్శలు బలంగా వస్తున్నాయి. పైగా చక్కెర ధరలు పెరగడానికి ఇథనాల్ పెట్రోల్ కూడా ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇథనాల్ తయారీ కోసం భారీ స్థాయిలో చెరకు వినియోగం జరుగుతోంది. దీని వల్ల చక్కెర ఉత్పత్తికి చెరకు కొరత ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయం, పెట్రోల్ తయారీ కారణాల వల్లే చక్కెర ఉత్పత్తిదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, వ్యవసాయ యంత్రాల ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. ఇదంతా రైతులు భరిస్తూనే ఉన్నారు. అయితే పంట ధరలు పెరిగినప్పుడు ఎగుమతి ఆంక్షలు, సుంకాలు, నిల్వ పరిమితులు వంటి చర్యల వల్ల రైతులకు లభించే మంచి ధర తగ్గే అవకాశం ఉంటుంది. వినియోగదారులకు తక్కువ ధరలో ఆహారం అందించడం అవసరమే అయినప్పటికీ, ఆ భారాన్ని రైతులపై మాత్రమే మోపడం సరైన విధానం కాదు.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
రైతుల నుంచి సరైన ధరకు పంటలను కొనుగోలు చేసి, అవసరమైన వినియోగదారులకు సబ్సిడీతో అందించడం ఒక సమతుల్య విధానంగా ఉంటుంది. అప్పుడు వినియోగదారులకు తక్కువ ధరలో ఆహారం లభిస్తుంది, రైతులకు కూడా సరైన ఆదాయం వస్తుంది. వ్యవసాయ ధరల విధానం వినియోగదారుల ప్రయోజనాలతో పాటు రైతుల లాభదాయకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఉల్లిపాయలు, చక్కెర ధరల విషయంలో కనిపిస్తున్న వ్యత్యాసం భారత ఆహార ధరల విధానంపై పెద్ద చర్చకు దారితీస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు వినియోగదారులకు రక్షణ అవసరం. అదే సమయంలో రైతులకు స్థిరమైన మార్కెట్లు, న్యాయమైన ధరలు, ముందుగా అంచనా వేయగల విధానాలు కూడా అవసరం. ఈ రెండింటినీ సమతుల్యం చేసినప్పుడే ఆహార ధరల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది.
Also Read: నెలకు రూ.10 లక్షల వరకు జీతం.. ప్రపంచమంతా తిరిగిరావొచ్చు.. ఇంటర్మీడియట్ ఉంటే చాలు