100 Bike Theft | కొత్త కొత్త బైక్లంటే అతనికి మోజు. అందుకే వాటిని దొంగలించడానికి ఎంత కష్టమైన, ఎంత దూరమైన వెళ్లేవాడు. అలా తక్కవ సమయంలోనే 100కు పైగా బైక్ లు చోరీ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు అతడి కోసం గాలిస్తుంటే.. వారికి హింట్ ఇస్తూ తనను పట్టుకోగలరా?.. అని సవాల్ విసిరాడు. కానీ ఈ అత్యుత్సాహమే అతడి కొంప ముంచింది. పోలీసులు వందల సంఖ్యలో సీసీటీవి వీడియోలు గాలించి అతడిని గుర్తించి పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే… కర్ణాటక రాజధాని బెంగళూరుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో 100కు పైగా ద్విచక్ర వాహనాలను దొంగిలించిన నిందితుడిని బెంగళూరులోని కేఆర్పుర (కృష్ణరాజపురం) పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగను ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసాద్ బాబుగా గుర్తించారు. అతను దొంగిలించిన 100కు పైగా ద్విచక్ర వాహనాల విలువ సుమారు రూ.1.45 కోట్లు. ఈ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసాద్ బాబు గత మూడేళ్లుగా ద్విచక్ర వాహనాల దొంగతనాల్లో నిమగ్నమై ఉన్నాడు. అతను ఇళ్ల ముందు పార్క్ చేసిన బైక్లను లక్ష్యంగా చేసుకుని, హ్యాండిల్ లాక్లను పగలగొట్టి వాటిని సులభంగా దొంగిలించేవాడు. కేఆర్పురలో కొంతకాలం నివసించిన ప్రసాద్ బాబు డ్రైవర్గా, మెకానిక్గా పనిచేశాడు. ఆ తరువాత అతను త్వరగా డబ్బు సంపాదించాలని తప్పుడు మార్గంలోకి వెళ్లి దొంగతనాల చేయడం ప్రారంభించాడు. అతను ఉదయం ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సులో వచ్చి.. సాయంత్రం బైక్లను దొంగిలించి.. తక్కువ ధరకు అమ్మేవాడు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కోలార్ నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా ప్రసాద్ బాబు ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు.
Also Read: చదువు లేదు.. 100 కోట్లకు కుచ్చుటోపి, అదెలా సాధ్యం
ఎలా అరెస్ట్ చేశారంటే?..
జనవరి 10న ఒక వ్యక్తి తన ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగిలించబడిందని కేఆర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై కేఆర్పుర పోలీస్ ఇన్స్పెక్టర్ రామమూర్తి ఆధ్వర్యంలోని బృందం నిందితుడిని హోస్కోట్ టోల్ ప్లాజా సమీపంలో అరెస్టు చేసింది. పోలీసుల విచారణలో ప్రసాద్ బాబు తన నేరాన్ని అంగీకరించాడు. అతను గత మూడేళ్లలో 100కి పైగా ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.
పెద్ద సంఖ్యలో బుల్లెట్, పల్సర్ బైక్లు, స్కూటీలు స్వాధీనం
నిందితుడు అందించిన సమాచారం ఆధారంగా.. పోలీసులు 24 బుల్లెట్ బైక్లు, 16 సుజుకి యాక్సిస్ స్కూటీలు మరియు వివిధ కంపెనీలకు చెందిన 16 పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.1.45 కోట్ల విలువైన 100 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విజయంతో.. బెంగళూరు, కోలార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని 51 బైక్ చీరీ కేసులను పోలీసులు పరిష్కరించారు. ఈ వాహనాలకు చెందిన 49 మంది యజమానులను ఇప్పటివరకు గుర్తించారు.
దమ్ముంటే అరెస్ట్ చేయండి.. సవాల్ విసిరిన దొంగ
100కు పైగా ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ప్రసాద్ బాబు పోలీసులకు సవాలు విసిరాడు. అతను ఓ హీరో వెంట పోలీసులా వస్తున్న ఫోటోను వాట్సాప్లో షేర్ చేసి, తనను అరెస్టు చేయగలరా అని సవాలు చేశాడు. కేఆర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో 23 బైక్ చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను తీవ్రంగా తీసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ మాట్లాడుతూ.. “ఈ కేసులో మేము 100 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఈ వాహనాల విలువ సుమారు రూ.1.45 కోట్లు. ఈ కేసులను పరిష్కరించడం ద్వారా మేము ప్రజలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నాము” అని తెలిపారు.