నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలం ఇసుకపల్లి తీరంలో ఆదివారం సాయంత్రం తీవ్ర విషాదం నెలకొంది. సరదాగా గడుపుదామని సముద్ర తీరానికి వచ్చిన నలుగురు యువకులు అలల ఉధృతికి చిక్కి సముద్రంలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం కాసేపటికే తీరానికి కొట్టుకురాగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి ఇంకా తెలియరాలేదు.
అలల ఉధృతికి గల్లంతు..
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సెలవు దినం కావడంతో కొంతమంది యువకులు బృందంగా కలిసి అల్లూరు మండలం ఇసుకపల్లి బీచ్కు చేరుకున్నారు. సముద్రపు అలలతో ఆడుకుంటూ.. స్నానం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెద్ద అల రావడంతో నలుగురు యువకులు లోపలికి వెళ్లిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు, పర్యాటకులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో వారు కళ్లముందే నీటిలో మునిగిపోయారు.
యువకులు గల్లంతైన కొద్దిసేపటికే గాలింపు చేపట్టిన క్రమంలో, ఒక యువకుడి మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. మృతి చెందిన యువకుడిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తన స్నేహితుడు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తోటి యువకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఇసుకపల్లి తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
https://twitter.com/bigtvtelugu/status/2012121256783712425
సమాచారం అందుకున్న వెంటనే అల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో బోట్లు, వలలను ఉపయోగించి మిగిలిన ముగ్గురు యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చీకటి పడుతుండటంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది. గల్లంతైన వారు సమీప ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సముద్రం ఈ సమయంలో ప్రమాదకరంగా ఉంటుందని, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Rafale Jets: భారత రక్షణ రంగంలో సరికొత్త శకం.. 114 రాఫెల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్!