Hyderabad Crime News: ఆస్తుల వ్యవహారం ఎంతవరకైనా దారితీస్తుంది. చివరకు కన్నవారిని సైతం చంపేందుకు వెనుకాడరు. ఆ తరహా ఘటనలు అప్పుడప్పుడు మనం చూస్తున్నాము. అందుకు ఎగ్జాంపుల్ వ్యాపారవేత్త వీసీ జనార్థన్రావు ఉదంతం. వెల్జాన్ గ్రూప్ అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్థన్రావు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ని చంపిందెవరో తెలుసా? ఆయన మనవడు ఈ దారుణానికి తెగబడ్డాడు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.
వ్యాపారవేత్త జనార్థన్రావు సొంతూరు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతవాసి. వెల్జన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కూడా. కొన్నాళ్లుగా సోమాజిగూడలో ఉంటున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఫ్యామిలీలో ఆస్తుల గొడవలు ముదిరిపాకాన పడ్డాయి. ఇటీవల జనార్థన్రావు పెద్ద కుమార్తె కొడుకు శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీ డైరెక్టర్గా నియమించారు. మరో కూతురు కొడుకు కీర్తితేజకు కొంత వాటాను (నాలుగు కోట్ల రూపాయల షేర్లు) బదిలీ చేశారు.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రెండో కూతురు సరోజినీ దేవి, ఆమె కొడుకు కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చింది. ఆస్తుల విషయంలో తాత-మనవడు కీర్తితేజ మధ్య గొడవ జరిగింది. అదే క్రమంతో కూతురు సరోజినీ దేవి ఏదో పని నిమిత్తం ఇంట్లో వెళ్లింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న కీర్తితేజ, తనతో తెచ్చుకున్న కత్తితో తాత జనార్థన్రావు 73 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు.
తండ్రి అరుపులు విన్న కూతురు ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. కొడుకుని మందలించబోయారామె. అప్పటికే కోపంతో ఉన్న తేజ, తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ తతంగాన్ని చూసిన సెక్యూరిటీ దగ్గరకు రాబోయాడు. దగ్గరకు వస్తే అందర్నీ చంపేస్తానని హెచ్చరించాడు. వెంటనే ఘటన జరిగిన ప్రాంతం నుంచి పరారయ్యాడు కీర్తి తేజ.
ALSO READ: శ్రీవారిని దర్శించుకొని మరీ.. తిరుమలలో దంపతుల ఆత్మహత్య
ఘటన నుంచి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎట్టకేలకు నిందితుడు కీర్తితేజను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. జనార్థన్రావు స్పాట్ లో మృతి చెందగా, ఆయన రెండో కూతురు సరోజినీదేవి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం కీర్తితేజ వ్యక్తగతంపై పోలీసులు ఫోకస్ చేశారు. అమెరికాలో పీజీ చేసిన తేజ, ఇటీవల నగరానికి వచ్చాడు. డ్రగ్స్ బానిస అయ్యాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన బ్లడ్ శాంపుల్ సేకరించి డ్రగ్ టెస్ట్ కోసం పంపించారు పోలీసులు. మరి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
జనార్దన్రావుకు పాషా మైలారం, బాలానగర్, పటాన్ చెరువు ప్రాంతంలో వెల్జాన్ గ్రూప్ కంపెనీలున్నాయి. పాశ మైలారంలో కంపెనీలో పని చేస్తున్నాడు కీర్తి తేజ. తండ్రి జనార్ధన్రావుతో ఉంటోంది తల్లి సరోజినీదేవి. కొంతకాలంగా తల్లి, తాతకు దూరంగా ఉంటున్నాడు కీర్తి తేజ. తల్లిని ఆరుసార్లు కత్తితో పొడిచినట్లు గుర్తించారు పంజాగుట్ట పోలీసులు. ఘటన తర్వాత వెళ్లిపోతున్న కీర్తితేజను బీమా జువెలరీస్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు.
ఇక వ్యాపారవేత్త జనార్థన్రావు సహాయ కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదు. పలుమార్తు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్ల రూపాయల చొప్పున పలుమార్లు విరాళాలు ఇచ్చారు. ఇవేకాకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ స్వచ్ఛంధ సంస్థలకు విరాళాలు సైతం అందజేశారాయన.