Youtuber Dupes Hyderabad Woman| ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాల బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం కావడం అమాయకులకు మాయ మాటలు చెప్పి దోచుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఒక యువతిని ఒక యూట్యూబర్ తాను లండన్ కు చెందినవాడిగా పరిచయం చేసుకొని ఆమెతో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఆ తరువాత ఖరీదైన కానుకలు పంపించి చాలా తెలివిగా లక్షల దోచుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోనే జరిగింది.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ పాతబస్తీ యాకూత్ పురా ప్రాంతానికి చెందిన ఒక 20 ఏళ్ల యువతి షబానా (పేరు మార్చబడింది) కు డిసెంబర్ 2024లో వాట్సాప్ ద్వారా ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. తాను లండన్ లో నివసిస్తున్నానని.. యూట్యూబర్ గా మంచి పేరుందని నమ్మించాడు. అయితే ప్రారంభంలో షబానా అతడి మాటలను నమ్మలేదు. కానీ తరుచూ అతను ఫోన్ చేసి మాట్లాడుతుండడంతో షబానా అతడి ఫేక్ బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను పరిశీలించింది. వాటిలో అతను తరుచూ పోస్ట్ లు, రీల్స్ పెడుతుండడంతో ఆమె అతడిని నమ్మింది.
అయితే ఆ యూట్యూబర్ ఎప్పుడూ షబానాకు వీడియో కాల్ చేయలేదు. ఈ క్రమంలో ఆ యూట్యూబర్ షబానాకు ఖరీదైన డైమండ్ జువెలరీ, బంగారు నగలు, ఐఫోన్ 14 ప్రో కానుకలు పంపించినట్లు చెప్పాడు. అది విని షబానా అతడి వలలో పూర్తిగా పడిపోయింది. అతను చెప్పిన ప్రతీదీ నమ్మింది. అయితే ఆ వెంటనే కష్టాలు మొదలయ్యాయి.
Also Read: యువతిపై గ్యాంగ్రేప్ పట్టించుకోని భర్త.. ప్రియుడితో కలిసి ఆమె ఏం చేసిందంటే?..
నెల రోజుల క్రితం షబానాకు ఒక మూడో వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. అతను ఒక కోరియర్ ఏజెంట్. షబానా పేరు మీద లండన్ నుంచి ఖరీదైన కానుకలు వచ్చాయని ఆ కొరియర్ ఏజెంట్ చెప్పాడు. అయితే అవి తీసుకోవాలంటే కోరియర్ రెజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ చార్జీలు, ఏజెన్సీ ట్యాక్స్, దిగుమతి సుంకాలు లన్నీ కలిపి చెల్లించాలని అడిగాడు. అది విని షబానా ఆశ్చర్య పోయింది. మళ్లీ తన యూట్యూబర్ ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పగా.. తాను పంపించిన కానులక విలువ దాదాపు రూ.1 కోటి ఉంటుందని చెప్పాడు. అందుకోసం ఆ మాత్రం పన్నులు చెల్లించడం పెద్ద సమస్య కాదని తెలిపాడు.
షబానా కూడా రూ. కోటి విలువైన కానుకలు పొందేందుకు ఆశపడింది. వాటిని చేజిక్కించుకునేందుకు తన తల్లి, పిన్ని బంగారు నగలు అమ్మేసి కొరియర్ ఏజెంట్ అడిగిన పన్నులు చెల్లించాలని సిద్ధపడింది. అందుకోసం దశల వారీగా దాదాపు రూ.4.2 లక్షలు చెల్లించింది. కానీ అంత చెల్లించినా ఆ కొరియర్ ఏజెంట్ ఇంకా రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అవి చెల్లించడానికి షబానా వద్ద ఇక డబ్బు సరిపోలేదు. అందుకోసం తన స్నేహితులను, మిగతా బంధువులను సంప్రదించింది. ఈ క్రమంలో కొందరు ఆమెను ఇదంతా మోసం అని హెచ్చరించారు.
షబానా కూడా ఆ కొరియర్ ఏజెంట్ పై అనుమానంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద రూ.4.2 లక్షలు తీసుకొని ఇప్పటివరకు తనకు రావాల్సిన లండన్ కానుకలు ఇవ్వలేదని చెప్పింది. పోలీసులు విచారణ చేయగా.. ఆ కొరియర్ ఏజెంట్ ఒక ఫేక్ అని తేలింది. పైగా ఆమెకు ఫోన్ చేసే యూట్యూబర్ ప్రియుడు నిజానికి యూట్యూబర్ కాదని తేలింది. ప్రస్తుతం సైబర్ పోలీసులు షబానా వద్ద లక్షలు దోచుకున్న మోసగాళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.