మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన చెల్లెలిని ప్రేమిస్తున్నాడన్న కక్షతో నలుగురు యువకులు కలిసి ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, అటవీ ప్రాంతంలో ప్రాణాపాయ స్థితికి చేరేలా దాడి చేశారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ హత్యాయత్నం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది.
ప్రేమ వ్యవహారమే కారణం..
పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాథోల్ గ్రామానికి చెందిన దేవ్ సింగ్ (24) అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. దేవ్ సింగ్పై పగ పెంచుకున్న యువతి సోదరులు అతడిని ఎలాగైనా అంతమొందించాలని పక్కా ప్లాన్ వేశారు.
ప్లాన్ ప్రకారమే ట్రాప్..
యువతితో ఫోన్ చేయించి దేవ్ సింగ్ను నమ్మించి ట్రాప్ చేశారు. యువతి పిలుస్తోందని నమ్మిన దేవ్ సింగ్, ఆమెను కలుసుకోవడానికి నర్సాపూర్ బస్టాండ్ వద్దకు చేరుకున్నాడు. అక్కడే మాటువేసిన యువతి నలుగురు సోదరులు దేవ్ సింగ్ను బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారు. నర్సాపూర్ – తూప్రాన్ రహదారి మధ్యలో ఉన్న చాకరిమెట్ల అటవీ ప్రాంతానికి అతడిని తరలించారు.
అడవిలో అమానుషంగా దాడి..
అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత నలుగురు నిందితులు దేవ్ సింగ్పై విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన దేవ్ సింగ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. అతడు చనిపోయాడని భావించిన నిందితులు, సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు దేవ్ సింగ్ మొబైల్ ఫోన్ను తీసుకుని కారులో అక్కడి నుండి పరారయ్యారు.
ప్రాణాలతో బయటపడిన యువకుడు..
కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చిన దేవ్ సింగ్, రక్తమోడుతున్న గాయాలతోనే అతి కష్టం మీద అడవి నుంచి రోడ్డుపైకి చేరుకున్నాడు. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి చేరి తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు అతడిని తక్షణమే జీడిమెట్లలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దేవ్ సింగ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల విచారణ..
బాధితుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
ALSO READ: Mumbai: అగ్గిపెట్టెంత కొంప రూ.1.25 కోట్లా?ఎక్కడో కాదు ఇండియాలోనే? టాయిలెట్ ఎక్కడుందంటే?