Lightning Strike: ములుగు జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి ఒక పేద రైతు అతలాకుతలమయ్యాడు. ఊహించని రీతిలో విరుచుకుపడిన వాన, దానికి తోడైన పిడుగుపాటు ఒకేసారి 21 మూగజీవాలను బలితీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ జీవనాధారంగా నమ్ముకున్న పశువులు కళ్లముందే మృత్యువాత పడటంతో ఆ రైతు కుటుంబం గుండె లవిసేలా రోదిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది.
పొలంలోనే ఒరిగిపోయిన మూగజీవాలు
తాడ్వాయి మండలం అంకంపల్లి గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య రోజులాగే శుక్రవారం సాయంత్రం కూడా తన ఆవులను ఇంటి సమీపంలోని పొలంలో కట్టివేశాడు. అయితే, రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షంతో పాటు పెద్ద పెట్టున ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఒక భారీ పిడుగు ఆవులు కట్టేసిన ప్రాంతంపై పడింది. ఆ ధాటికి పొలంలో కట్టేసి ఉన్న 21 ఆవులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయి. శనివారం ఉదయం వెళ్లి చూసేసరికి ఆవులన్నీ నిర్జీవంగా పడి ఉండటం చూసి సమ్మయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
కోలుకోలేని ఆర్థిక నష్టం.. సాయం కోసం ఎదురుచూపు
ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో పశువులు మృత్యువాత పడటంతో సమ్మయ్యకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ఆ ఆవుల పాలే ఆ కుటుంబానికి ప్రధాన జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆవులన్నీ చనిపోవడంతో సమ్మయ్య కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. గ్రామంలోని పశువుల యజమానులతో పాటు స్థానికులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత రైతు కుటుంబానికి పరిహారం అందించి ఆదుకోవాలని అంకంపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.