Road Accident: పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును అతివేగంతో కారు ఢీ కొట్టడంతో.. స్పాట్లోనే తొమ్మిది మంది మృతి చెందారు. వీరంతా ఓ వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారులోని ప్రయాణికులంతా మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
కాగా.. సూర్య గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ వేస్ట్ రవాణా చేసే డంపర్ వాహనం.. సుమారు 100 అడుగుల పై నుంచి కిందకు పడి.. ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డంపర్ వాహనంకు తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్న విషయం.. క్వారీ మేనేజర్ దృష్టిలో ఉన్నప్పటికీ.. ఆ డంపర్ వాహనంకు తాత్కాలిక మరమ్మతులు చేయించి.. ఉపయోగిస్తున్నారంటున్నారు కార్మికులు. ప్రమాదంలో మృతి చెందిన డంపర్ డ్రైవర్ రంగయ్య అనంతపురం వాసిగా గుర్తించారు. మరొకరిని నాయుడుపాలెం వాసిగా గుర్తించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వివరాలు సేకరిస్తున్నాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజాబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.
మృతులు మల్లాం గ్రామంలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. విరవ మెయిన్ రోడ్డు వద్ద వస్తున్న ఆటోను ఇటుకల వ్యాన్ ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. వీరందరిని రోజు వారి కూలీలుగా గుర్తించారు స్థానికులు.
Also Read: కేదార్నాథ్లో పొట్టుపొట్టు కొట్టుకున్న యాత్రికులు.. వీడియో వైరల్
మరోవైపు హైదరాబాద్ హయత్ నగర్ PS పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ రామావత్ మాన్ సింగ్ మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్తుండగా…పెద్ద అంబర్ పేట్ వద్ద టిప్పర్ లారీ సడన్ బ్రేక్ వేయడంతో… కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామావత్ మాన్ సింగ్ యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఘటన స్థలం చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.