గత ఏడాది కర్నాటకలో సినీ ఫక్కీలో జరిగిన బ్యాంకు దోడిపీ కేసును 6 నెలల తర్వాత పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీలో మాస్టర్ మైండ్ తో పాటు మొత్తం ఆరుగురుని నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం 17 కిలలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ‘మనీ హీస్ట్’ సినిమా చూసి 6 నెలల నుంచే పక్కగా ప్లాన్ అమలు చేసి, బ్యాంకుకు కన్నం వేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆధారాలు లభించకుండా ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. సుమారు రూ. 13 కోట్ల విలువైన బంగారాన్ని పాత బావిలో దాచినట్లు తెలిపారు.
6 నెలల క్రితం బ్యాంకు దోపిడీ
సుమారు 6 నెలల కిందట కర్ణాటకలోని దావనగరె జిల్లాలో భారీ బ్యాంకు దోపిడీ జరిగింది. అక్టోబరు 28న న్యామతి ఎస్బీఐ బ్యాంకును ఆరుగురు దుండగులు కొల్లగొట్టారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కర్నాటకకు చెందిన విజయ్ కుమార్(30), అజయ్ కుమార్(28), పరమానంద్(30)తో పాటు తమిళనాడుకు చెందిన అభిషేక్(23), చంద్రు(23), మంజునాథ్(32)గా గుర్తించారు. ఈ దోపిడీకి మాస్టర్ మైండ్ విజయ్ కుమార్ అని పోలీసులు వెల్లడించారు. ఆయన ఓ బేకరీ షాపును నడుపుతున్నట్లు గుర్తించారు. వీళ్లంతా కలిసి పక్కా ప్లాన్ ప్రకారం బ్యాంకు దోపిడీకి పాల్పడ్డట్లు గుర్తించారు. దుండగులంతా స్పానిష్ వెబ్ సిరీస్ ‘మనీ హీస్ట్’ చూసి, అదే ప్రకారం ప్రకారం బ్యాంకు దోపిడీ చేసినట్లు వెల్లడించారు.
దోపిడీ ఆలోచన ఎలా వచ్చింది?
కర్నాటకలోని న్యామతికి చెందిన విజయ్ కుమార్ ఓ బేకరీ నడుపుతున్నాడు. రెండు ఏండ్ల క్రితం రూ. 15 లక్షల లోన్ కోసం అప్లై చేశాడు. ఆయన సిబిల్ స్కోర్ సరిగా లేదని భావించిన బ్యాంకు అధికారులు లోన్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆ తర్వాత తన రిలేటివ్స్ ద్వారా లోన్ కోసం అప్లై చేయించాడు. అప్పుడూ రిజెక్ట్ అయ్యింది. తనకు లోన్ ఇవ్వని బ్యాంకు మీద విజయ్ కి కోపం పెరిగింది. ఎలాగైనా బ్యాంకును కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే మరో ఐదుగురు మిత్రులతో కలిసి ఈ దోపిడీకి స్కెచ్ వేశారు. అందరూ కలిసి ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్ ను చూశారు. అలాగే ప్లాన్ అమలు చేయాలని అనుకున్నారు. దోపిడీకి అవసరమైన ఆయుధాలు సేకరించారు. హైడ్రాలిక్ కట్టర్, గ్యాస్ సిలిండర్ సహా ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. సుమారు 6 నెలల పాటు ఈ ప్లాన్ కొనసాగింది.
కిటికీల ద్వారా బ్యాంకులోకి ఎంట్రీ
ఇక ఆరుగురు దుండగులు అక్టోబరు 28, 2024 కిటికీల ద్వారా బ్యాంకులోకి అడుగుపెట్టారు. బ్యాంకులోకి అడుగు పెట్టగానే సీసీ టీవీ కనెక్షన్లు తొలగించారు. హార్డ్ డిస్క్ పగులగొట్టారు. గ్యాస్ కట్టర్ సాయంతో లాకర్లు ఓపెన్ చేశారు. అందులోని బంగారం అంతా దోచుకెళ్లారు. ఈ దోపిడీ అంతా కేవలం అరగంటలో పూర్తి చేశారు. వాళ్లు వెళ్లే మార్గాన్ని పోలీసు కుక్కలు పసిగట్టకుండా కారంపొడి చల్లుకుంటూ వెళ్లారు. దోపిడీ గురించి తెలుసుకుని స్పాట్ కు చేరుకున్న పోలీసులు ముందుగా ఇదో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా పనిగా భావించారు. ఇలాంటి దోపిడీలకు పాల్పడిన పలు ముఠాలను పోలీసులు విచారించారు. కానీ, వాళ్లకు సంబంధం లేదని తేలింది. చివరకు తమిళనాడుకు చెందిన కొందరు వ్యక్తులను ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వారిని విచారిస్తే, అసలు విషయం బయటకు వచ్చింది. దోపిడీకి పాల్పడిన మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దోపిడీ చేసిన బంగారాన్ని తమిళనాడు మధురైలోని ఓ పాత బావిలో దాచినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కొంత బంగారాన్ని విజయ్ బయటకు తీసి, తన బంధువులు, స్నేహితుల అకౌంట్లలో జమ చేశాడు. మరికొంత బంగారాన్ని అమ్మినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ బంగారం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్, అవి చూపిస్తూ.. మనీ డిమాండ్, చివరికి..