UP Police : నేరాల్లో వంద రకాలున్నా.. దొంగల తెలివితేటలు చూస్తే మాత్రం మతిపోవాల్సింది. కళ్లతోనే స్కాన్ చేసేసే కేటాగాళ్లు.. ఎవరి దగ్గర వాళ్ల పనవుతుందో బాగా తెలుసు. పరిస్థితులు అనుకూలంగా ఉండాలే కానీ.. ఎలాంటి చోటైనా చేతి వాటం చూపిస్తుంటారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల ఇళ్లు టార్గెట్ గా మారాయి. బిడ్డల కోసమంటూ.. జీవితాంతం దాచుకున్నది, గుట్టుగా దోచుకుపోతున్నారు. ఇంకేముంది.. అప్పటి వరకు ఉత్సహాంగా, ఆనందంగా ఉన్న ఆ ఇళ్లు ఒక్కసారిగా దుఃఖంతో కన్నీరుమున్నీరుగా విలపించాల్సిన పరిస్థితులు. అప్పటికి జరగాల్సిన కార్యాన్ని చక్కబెట్టేసి.. పోలీసుల దగ్గరకు వెళ్లినా ఉపయోగం ఉండడం లేదు. ఇలాంటి వాళ్లకోసమే.. సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేశారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.
పెళ్లంటే ఆనందం, ఉత్సాహం.. ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులతో కళకళలాడుతుంటాయి. పేద వాళ్లైనా, మధ్యతరగతి వాళ్ల పెళ్లిళ్లు అయినా.. ఈ హడావిడి సాధారణం. ఇక ఇంట్లో వాళ్లకు అయితే.. అన్నీ ఉరుకులు పరుగులే. ఏ వస్తువులు, ఎక్కడ పెట్టారోననే కంగారు నుంచి పెళ్లి సమయానికి అందుబాటులో ఉంచేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. ఇంట్లో వాళ్లు, అమ్మాయి, అబ్బాయి తరఫున వాళ్లు కూడా చేతనైన సాయం చేస్తుంటారు. అదిగో.. అలాంటి పరిస్థితు కోసమే ఎదురు చూస్తుంటారు దొంగలు. ఎప్పుడెప్పుడు.. పెళ్లింట్లో పరిస్థితులు మంచి ఉత్సాహంగా ఉంటాయో.. అప్పుడు వాళ్ల పని మొదలవుతుంది. వచ్చిన పని కానిచ్చుకుని.. తాపీగా అక్కడి నుంచి బయటపడిపోతుంటారు ఈ మయాగాళ్లు.
సాధారణంగా.. షాపింగ్ మాల్స్, రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగల పని సులువుగా ఉంటుంది. క్షణాల్లోనే విలువైన వస్తువులు, ఆభరణాలు కాజేసి.. ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి జారుకుంటుంటారు. కానీ.. ఇప్పుడు వాళ్లు రూటు మార్చారు. పెళ్లిళ్లు, శుభకార్యాలున్న ఇళ్లల్లో పని త్వరగా అయిపోతుందని గుర్తించి.. అలాంటి దొంగతనాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఈ తరహా కేసులు ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల భారీగా పెరిగిపోయాయి.
దొంగతనాలు జరిగాయంటూ.. పోలీసుల్ని ఆశ్రయిస్తున్న వారిలో.. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో దోపిడీలకు గురైన వారే అధికంగా ఉన్నట్లు యూపీ పోలీసులు గుర్తించారు. దాంతో ఈ దొంగల ముఠాలకు చెక్ పెట్టేందుకు యూపీ పోలీసుల సరికొత్త ప్రణాళిక రూపొందించారు. ఇకపై పోలీసులు అన్ని పెళ్లిళ్లకు సాధారణ దుస్తుల్లో హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. ఎవరికీి అనుమానం రాకుండా.. పెళ్లి ఇంట్లో కలిసిపోనున్నారు.
Also Read : సుల్తానాబాద్ జిల్లాలో చేతబడి కలకలం.. పంటపొలంలో మనిషిబొమ్మ.. వెళ్లి చూడగానే!
ఆనందంగా జరుపుకుంటున్న పెళ్లి ఇంట్లో.. బంధువుల్లా పనుల్లో తోడ్పడుతూ.. అనుమానితులపై నిఘా పెట్టనున్నారు.. యూపీ పోలీసులు. అనుమానం వచ్చిన వారిపై ఓ కన్నేసి ఉంచనున్నారు. ఎవరూ చూడడం లేదుగా అనుకుని.. నెమ్మదిగా ఏదైనా కొట్టేశారా.. ఇక నేరుగా అక్కడి నుంచి పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లనున్నారు. ఇంతకుముందు రద్దీ ప్రాంతాల్లో, షాపింగ్ మాల్స్ దగ్గర చేతివాటం చూపించే కేటుగాళ్లు.. ఇప్పుడు నేరుగా పెళ్లిల్ల దగ్గరే మాటు వేస్తుండడంతో.. పోలీసులు సైతం దారి మార్చారు.