Hyderabad : ఓ యువతి మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చింది. ఎంట్రీ ప్రాసెస్ చేస్తుండగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులకు డౌట్ వచ్చింది. మస్కట్ ఎందుకు వెళుతున్నావని అడగ్గా.. ఆమె సమాధానం చెప్పడంలో తడబడింది. అనుమానంతో మరిన్ని ప్రశ్నలు అడిగడంతో.. అడ్డంగా దొరికిపోయింది. డాక్యుమెంటేషన్ కూడా సరిగ్గా లేకపోవడంతో వెంటనే ఆ యువతిని అరెస్ట్ చేశారు.
గోదావరి టు మస్కట్
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతికి మస్కట్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ట్రావెల్ ఏజెంట్ సత్యనారాయణ ట్రాప్ చేశాడు. ఎయిర్పోర్టులో అధికారులకు ఎలా ఆన్సర్ చెప్పాలో ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. మస్కట్ చూసేందుకు టూరిస్టులా వెళుతున్నానని చెప్పమంటే.. ఆమె మాత్రం ఉద్యోగం కోసం అంటూ సడెన్గా అసలు మేటర్ చెప్పేసింది. అంతే ఇమ్మిగ్రేషన్ స్టాప్ పట్టేసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో ట్రావెల్ ఏజెంట్ సత్యనారాయణను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దీని వెనకాల పెద్ద ముఠానే ఉందని గుర్తించారు.
ఇంటర్నేషనల్ మాఫియా..
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఉద్యోగాల పేరుతో అమాయకులను ఎడారి దేశంలో అమ్మేస్తూ.. దుబాయ్ షేక్ల నుంచి లక్షల రూపాయలను దండుకుంటున్న కేటుగాళ్ల ఆట కట్టించారు. సత్యనారాయణ అనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మస్కట్లో ఉంటూ దందా నడిపిస్తున్న సుందరం అనే వ్యక్తిని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
షేక్లతో డీల్.. పైసా వసూల్
ఎడారి దేశాలకు వెళ్లి పని చేసి, బాగా డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లనే ఈ ముఠా లక్ష్యంగా ఎంచుకుంటోంది. పైసా ఖర్చు లేకుండా తీసుకెళ్తామని.. దుబాయ్, మస్కట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపుతోంది. నకిలీ వర్క్ పర్మిట్లతో ఇమ్మిగ్రేషన్ అధికారులను బురిడీ కొట్టిస్తోంది. కొందర్ని విజిట్ వీసా మీద దుబాయ్, మస్కట్కు పంపించి.. అక్కడ షేక్లకు అమ్మేస్తోందీ ముఠా. ఒక్కో వ్యక్తిని అప్పగించినందుకు.. 2 నుంచి 4 లక్షల రూపాయలను షేక్ల దగ్గర తీసుకుంటున్నారు. ఆ తర్వాత షేక్లు.. బాధితులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.
హూ ఈజ్ సుందరం?
ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో, పక్కా ప్లాన్తో నిందితుడు సత్యనారాయణను ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్లో ఉంటూ దందా నడుపుతున్న సుందరం అనే నిందితుడిని ఇండియాకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలో అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేయబోతున్నారు.