Miss Universe 2024 : మిస్ యూనివర్స్ (Miss Universe 2024) వంటి అందాల పోటీలలో పాల్గొనడం అంటే అదృష్టం అనే చెప్పాలి. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. కానీ తాజాగా ఓ మోడల్ మాత్రం ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ ను బాయ్ ఫ్రెండ్ కారణంగా చేజార్చుకుంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం పదండి.
మిస్ యూనివర్స్ (Miss Universe 2024) పోటీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటి. కాబట్టి దాని నియమాలు, నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అయితే ఇటీవల మిస్ యూనివర్స్ 2024 పోటీ నుండి ఒక కంటెస్టెంట్ ను బయటకు గెంటేశారు. మిస్ యూనివర్స్ 2024 (Miss Universe 2024) గ్రాండ్ ఫినాలే నవంబర్ 17న జరగనుంది. ఈ నేపథ్యంలో పనామేనియన్ కంటెస్టెంట్ ని పోటీ నుండి తొలగించి షాక్ ఇచ్చారు నిర్వాహకులు. దానికి కారణం ఆవిడ రూల్స్ ను అతిక్రమించింది.
మిస్ యూనివర్స్ (Miss Universe 2024) పోటీల్లో పనామా తరపున పోటీ చేసేందుకు వచ్చిన మోడల్ ఇటలీ మోరా (Italy Mora). ఆమె అనుమతి లేకుండానే తన ప్రియుడిని కలిసేందుకు ఓ హోటల్కి వెళ్లింది. ఆ తర్వాత ప్రియుడు జువాన్ అబాడియాతో కలిసి మెక్సికోకు కూడా వెళ్లింది. అయితే విషయం తెలుసుకున్న మిస్ యూనివర్స్ నిర్వాహకులు ఆమెకు ఊహించని షాక్ ఇచ్చారు. డైరెక్ట్ గా అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపొమ్మంటూ గెంటేశారు.
ఇటలీ మోరా (Italy Mora) ఈ విషయాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నించనట్టు సమాచారం. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో ఆమె నిర్వాహకులతో వాగ్వాదానికి దిగింది. ఇదంతా జరిగాక ఇటలీ మోరా పోటీకి అనర్హులైంది. ఈ విషయంపై ఇంకా అఫిషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఫైనల్స్కు కొద్ది రోజుల ముందు ఓ కంటెస్టెంట్ ఇలా ఎలిమినేట్ కావడం షాకింగ్గా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇటలీకి సపోర్ట్ చేస్తుంటే, ఇక్కడిదాకా కష్టపడి వచ్చిన ఆ అమ్మాయి మరికొన్నాళ్ళు బాయ్ ఫ్రెండ్ ను కలవకపోయి ఉంటే ఏం అయ్యేది ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఆమెను ఇలా అర్ధాంతరంగా ఎలిమినేట్ చేయడం వెనుక వేరే కారణం కూడా ఉందని కొందరు అంటున్నారు.
ఇదిలా ఉండగా, మిస్ యూనివర్స్ 2024 (Miss Universe 2024) పోటీల్లో ఇండియాకు రియా సింఘా (Rhea Singha) ప్రాతినిధ్యం వహించనుంది. ఇటీవలే ఆమె ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024′ (Miss Universe India- 2024) కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. జైపూర్ వేదికగా జరిగిన పోటీల్లో, 51 మంది ఫైనలిస్టులతో పోటీ పడి, ఆవిడ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని ధరించిన హీరోయిన్ ఊర్వశీ రౌతేలా.. ఈ ఈవెంట్కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇక ప్రతిష్టాత్మక ‘మిస్ యూనివర్స్ 2024′ పోటీలో భారతదేశం తరపున రియా పాల్గొనబోతున్నారు. మిస్ యూనివర్స్ 2024 గ్రాండ్ ఫినాలే నవంబర్ 17న మెక్సికోలో జరగనుంది.