John Abraham: సినీ సెలబ్రిటీలు ఏం మాట్లాడినా దానిని ఏదో ఒక విధంగా కాంట్రవర్సీ చేయాలని చూసే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అందుకే చాలామంది చాలా విషయాల్లో తమ అభిప్రాయాలను ఓపెన్గా చెప్పడానికి ఇష్టపడరు. కానీ బాలీవుడ్లో మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే సెలబ్రిటీలే ఎక్కువ. తమ స్టార్డమ్ను పక్కన పెట్టి మరీ రాజకీయ విషయాల్లో కూడా తమ అభిప్రాయాలను ఓపెన్గా చెప్పేస్తుంటారు బీ టౌన్ సెలబ్రిటీలు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో జాన్ అబ్రహం కూడా అదే పనిచేశాడు. ఇండియాలో మైనారిటీలకు రక్షణ ఉందా లేదా అనే అంశంపై చాలా బోల్డ్ కామెంట్స్ చేశాడు ఈ హీరో. అంతే కాకుండా తాను కూడా మైనారిటీకి చెందినవాడే అని రివీల్ చేశాడు.
రక్షణ ఉందా.?
ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘ది డిప్లోమాట్’ అనే సినిమా థియేటర్లలో విడుదలయ్యి సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఒక సీక్రెట్ స్పై జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ చాలా బాగుందంటూ దీనిని చూసిన ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడిపేస్తున్నాడు జాన్ అబ్రహం. అందులో భాగంగానే తను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో అసలు ఇండియాలో మైనారిటీకి రక్షణ ఉందా లేదా అని తనకు ప్రశ్న ఎదురయ్యింది. తాను కూడా మైనారిటీనే అయినా ఇండియాలో ఉన్నంత సేఫ్గా తనకు మరే దేశంలో అనిపించలేదని సమాధానమిచ్చాడు జాన్ అబ్రహం.
తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్
‘‘నేను యాక్టర్ను కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని ప్రేక్షకులు అనుకోవచ్చు. యాక్టర్లను ఏ కారణం వల్ల అయినా ప్రేక్షకులు ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ నేను ఒక మైనారిటీకి చెందినవాడిని. మా అమ్మ పెర్షియాకు చెందిన జోరోస్టర్. మా నాన్న సిరియన్ క్రిస్టియన్. అయినా కూడా ఇండియాలో నేను చాలా సేఫ్గా ఫీలవుతున్నాను. నాకు నా దేశం అంటే ఇష్టం. నేను ఇక్కడ మాత్రమే సేఫ్గా ఫీలవుతాను. ఇండియా మైనారిటీలకు సేఫ్ అని చెప్పడానికి నేను ఉదాహరణ. నేను ఒక మైనారిటీ నుండి వచ్చాననే విషయం ఎవ్వరికీ అవసరం లేదు. దాంతో ఎవ్వరికీ ఏ ప్రాబ్లం లేదు కూడా’’ అంటూ ఇతర దేశాల పరిస్థితి గురించి ప్రస్తావించాడు జాన్ అబ్రహం.
Also Read: 20 ఏళ్ల క్రితం చెప్పావ్, ఇప్పుడు చేశావ్.. మాజీ భార్యకు హృతిక్ రోషన్ లేఖ
ఇండియన్గా గర్వపడుతున్నాను
‘‘పార్సీస్తో ఎవరికి ప్రాబ్లమ్ ఉంటుంది.? నా విషయానికి వస్తే ఇండియాలో నాకు చాలా సేఫ్ అనిపిస్తుంది. ఇండియన్ అయినందుకు నేను గర్వపడుతున్నాను. నేను కూడా ఒక ఇండియన్నే అని అనుక్షణం అనుకుంటాను’’ అంటూ చెప్పుకొచ్చాడు జాన్ అబ్రహం (John Abraham). మైనారిటీల గురించి ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక జాన్ అబ్రహం హీరోగా నటించిన ‘ది డిప్లోమాట్’ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదలయ్యింది. శివమ్ నాయర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దేశవ్యాప్తంగా పాజిటివ్ రివ్యూలు లభిస్తున్నాయి. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను చూసి చాలా బాగుందంటూ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.