MS.Narayana Birth Anniversary:స్వర్గీయ హాస్యనటులు ఎం ఎస్ నారాయణ (MS Narayana) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 17 సంవత్సరాల కెరియర్ లోనే దాదాపు 700 పై చిలుకు చిత్రాలలో నటించి, రికార్డు సృష్టించారు. చదువుకునే రోజుల్లోనే హాస్య రచనలు చేసే ఈయన.. కొన్ని నాటకాలు కూడా రాశారు. ఇక దర్శకుడు రవి రాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేసి.. ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలలో నటించారు కూడా.. ఇక నటుడుగా ఆయనకు గుర్తింపు తీసుకొచ్చిన చిత్రం ‘మా నాన్నకు పెళ్లి’. 1997లో వచ్చిన ఈ సినిమాలో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆ తర్వాత కాలంలో ఎక్కువగా ఎమ్మెస్ నారాయణకు ఇలాంటి పాత్రలే వచ్చాయి. ఇక ఈయన దర్శకుడిగా కొడుకు, భజంత్రీలు వంటి చిత్రాలకు పనిచేశారు అలా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈయన.. 2015 జనవరి 23న అనారోగ్య కారణాలతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హోదా స్థాయికి..
ఇదిలా ఉండగా ఈరోజు ఆయన బర్త్ యానివర్సరీ కావడంతో ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆయన ప్రేమ పెళ్లి. మరి ఆయన ఎవరిని.. ఎప్పుడు ప్రేమించారు.. వీరి పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లాలోని నిడమర్రు లో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి మైలవరపు బాబిరాజు.. తల్లి వెంకటసుబ్బమ్మ.. వీరి కుటుంబంలో మొత్తం పదిమంది పిల్లలు.. ఏడుగురు అబ్బాయిలు కాగా ముగ్గురు అమ్మాయిలు. కుటుంబం పెద్దది కావడంతో వ్యవసాయం చేస్తూ వచ్చిన డబ్బులు చాలక కుటుంబం ఆర్థికంగా దిగజారిపోయింది. దీంతో పొలం పనులకు వెళ్ళవలసి వచ్చింది. ఇక ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకపోయినా ఉన్న దాంట్లోనే ఇల్లందులో చదువు కొనసాగించారు. అలా పదవ తరగతి పూర్తయిన తర్వాత తన ఇంటికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న పత్తేపురంలో ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల పాటు భాషా ప్రవీణ కోర్స్ చేశారు..
ఎమ్మెస్ నారాయణ ప్రేమ, పెళ్లి..
అదే పత్తేపురంలోని మూర్తి రాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) లెక్చరర్ గా పనిచేయగా ఆయన వద్ద ఎమ్మెస్ నారాయణ శిష్యరికం చేశారు. ఇక అక్కడే ఎమ్మెస్ నారాయణ జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసింది అని కూడా చెబుతూ ఉంటారు. ఇక అలా శిష్యరికం చేస్తున్న సమయంలోనే తన క్లాస్మేట్ అయిన కళా ప్రపూర్ణ (Kala prapoorna)ను ప్రేమించగా.. ఆ సమయంలో కుటుంబ సభ్యుల నుండి కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కారణం వీరిది కులాంతర వివాహం. అయితే వీరి ప్రేమ విషయం పరుచూరి గోపాలకృష్ణకు తెలియడంతో వీరి పెళ్లిని ఆయనే దగ్గరుండి చేయించారు. ఇక ఈయనకు కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పెళ్లయిన తర్వాత పశ్చిమగోదావరి జిల్లా కేజీఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఇక సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో టీచర్ పదవికి రాజీనామా చేసి నటన రంగంలోకి అడుగు పెట్టారు.