Siree Lella: ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహా కుంభమేళా 2025 జనవరి 13 నుంచి మొదలై ఫిబ్రవరి 26 వరకు అనగా మహాశివరాత్రి పర్వదినంన ముగియనున్న విషయం తెల్సిందే. గంగ, యమున, సరస్వతి నదుల కలసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఆత్మను శుద్ధ చేసి పాపాలను కడిగేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు.
ఇక ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా మహాకుంభమేళాకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి.. తమ పాపాలను కడిగేసుకుంటున్నారు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ, హేమ మాలినీ, సంయుక్త మేనన్, యాంకర్ లాస్య, బింధుమాధవి, శ్రీనిధి శెట్టి, పూనం పాండే, పవిత్ర గౌడ, బిగ్ బాస్ ప్రియాంక జైన్, దిగంగన సూర్య వంశీ, రాజ్ కుమార్ రావు, సోనాల్ చౌహాన్ లాంటి సెలబ్రిటీలు మహాకుంభమేళాలో సందడి చేశారు.
తాజాగా మరో నటి మహా కుంభమేళాలో దర్శనమిచ్చింది. ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమానే చేసింది. అయినా ఎందుకు అంత ప్రత్యేకం అంటే.. ఆ చిన్నది త్వరలోనే నారావారి కోడలుగా మారబోతుంది. ఇప్పుడు ఆమె ఎవరో తెలిసిందా.. ? నారా రోహిత్ ను వివాహమాడే చిన్నది సిరి లేళ్ల.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకుగా నారా రోహిత్ బాణం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్నే అందుకున్నా.. ఒక్కో సినిమాను ఆచితూచి ఎంచుకోవడంలో రోహిత్ తడబడ్డాడు. కొన్ని సినిమాలు చేసినా అవి రోహిత్ ను స్టార్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. సోలో, అప్పట్లో ఒకడుండేవాడు, ప్రతినిధి.. ఇలా కొన్ని సినిమాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. ఇక గతేడాది ప్రతినిధి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా రాజకీయ ఒత్తిడి వలన విజయాన్ని అందుకోలేకపోయింది.
ప్రతినిధి 2 లో హీరోయిన్ గా నటించిన సిరినే రోహిత్ వివాహామాడుతున్నాడు. గతేడాది అక్టోబర్ లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య హైదరాబాదులో వీరి నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. నారా, నందమూరి కుటుంబాలు మాత్రమే ఈ ఎంగేజ్ మెంట్ కు హాజరయ్యారు. శిరీష ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివి అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేసింది. అయితే సినిమాలలో నటించాలనే కోరికతో జాబ్ వదిలేసి హైదరాబాద్ కి వచ్చి తన అక్క ప్రియాంక వద్ద ఉంటూ సినిమాలలో నటించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే నారా రోహిత్ తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
ఇక ఎంగేజ్ మెంట్ తరువాత శిరీష.. ఇదుగో ఇలా మహా కుంభమేళాలో దర్శనమిచ్చింది. చాలా సాదాసీదాగా శిరీష కనిపించింది. ఎంతో భక్తితో పూజలు నిర్వహించి.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు నారావారి కోడలా.. అస్సలు గుర్తుపట్టలేకపోయామే అని కొందరు.. వదినా.. రోహిత్ అన్నను తీసుకెళ్లలేదా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.