Sri Tej: స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు.. ఫ్యాన్స్లో ఉండే ఎగ్జైట్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ టైర్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. ముందుగా స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్గా మార్చిన సినిమా ‘పుష్ప’. ఈ మూవీ విడుదలయిన తర్వాత దీని సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రావడం కోసం దాదాపు మూడేళ్లు పట్టింది. ‘పుష్ప 2’ సినిమా కోసం చాలామంది ఎదురుచూశారు. అందుకే ఈ మూవీ మొదటి రోజే చూడాలని చాలామంది ఫిక్స్ అయ్యారు. అలా ‘పుష్ప 2’ ప్రీమియర్స్ చూడడం కోసం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వచ్చిన ఒక కుటుంబంలో జరిగిన దారుణాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు.
అసలేం జరిగిందంటే.?
ఏ స్టార్ హీరో సినిమా విడుదలయినా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో మామూలు హడావిడి ఉండదు. అక్కడ సినిమా రిలీజ్ను ఒక సెలబ్రేషన్లాగా చేస్తారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్స్ను సెలబ్రేట్ చేసుకోవడానికి చాలామంది అభిమానులు ఆ థియేటర్ వద్దకు చేరుకున్నారు. అందులో శ్రీ తేజ్ అనే బాలుడు కూడా ఉన్నాడు. తను, తన తల్లిదండ్రులతో కలిసి ‘పుష్ప 2’ ప్రీమియర్స్ చూడడానికి సంధ్య థియేటర్కు వచ్చాడు. అదే సమయంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడంతో తనను చూడడానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీ తేజ్కు ఊపిరి ఆడకపోవడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. అంతే కాకుండా తన తల్లి రేవతి మరణించింది.
అలాంటి నిర్ణయం
డిసెంబర్ 4న ఈ ఘటన జరిగింది. అప్పటినుండి శ్రీతేజ్కు ఆసుపత్రిలో చికిత్స జరుగుతూనే ఉంది. అన్ని విధాలుగా శ్రీ తేజ్కు, తన కుటుంబానికి సహాయంగా ఉంటామని మూవీ టీమ్ ప్రకటించినా శ్రీ తేజ్కు జరిగిన బ్రెయిన్ డ్యామేజ్ తీవ్రంగా ఉండడంతో తను ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ చికిత్స జరుగుతున్నా, రోజురోజుకీ శ్రీ తేజ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని డాక్టర్లు చెప్తున్నా, తను మాత్రం మామూలు మనిషిగా ఇంకా బయటికి రాలేదు. అందుకే డాక్టర్లతో పాటు తన కుటుంబం కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుప్రతి నుండి తనను డిశ్చార్జ్ చేసి రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించుకున్నారు.
Also Read: విడుదలకు ముందే ఊచకోత.. హరి హర వీరమల్లు బిజినెస్ లెక్కలు.!
కళ్లు తెరిచాడు
ప్రస్తుతం శ్రీ తేజ్ (Sri Tej) కళ్లు తెరిచి చూస్తున్నాడని, గత 15 రోజులుగా నోటి ద్వారా లిక్విడ్స్ కూడా తీసుకోగలుగుతున్నాడని తన తండ్రి మీడియాతో తెలిపాడు. మనుషులను గుర్తుపట్టలేకపోయినా ప్రస్తుతం తన ఆరోగ్యం మాత్రం స్టేబుల్గానే ఉందని అన్నారు. అంటే తను ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఫిజియోథెరపీ చేస్తే మరికాస్త కోలుకునే అవకాశాలు ఉంటాయనే రియాబిలిటేషన్ సెంటర్కు తరలించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయిదు నెలలుగా పేషెంట్గా ఆసుప్రతి బెడ్పై ఉన్న శ్రీ తేజ్ ఇప్పటికైనా కోలుకోవాలని చాలామంది కోరుకుంటున్నారు.