Sri Tej Health: ‘పుష్ప 2’ సినిమా విడుదలయ్యి దాదాపు నెలరోజులు దాటింది. అయినా ఈ మూవీ ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో బ్రెయిన్ డ్యామేజ్ అయిన శ్రీ తేజ్ మాత్రం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం నిలకడగా ఉందంటూ డాక్టర్లు అప్డేట్ ఇస్తున్నా కూడా శ్రీ తేజ్ మాత్రం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత మంగళవారం అల్లు అర్జున్ స్వయంగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీ తేజ్ను కలిశాడు. తను వచ్చి వెళ్లిపోయిన తర్వాత మరోసారి శ్రీ తేజ్ హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు డాక్టర్లు. తన చికిత్స గురించి మరిన్ని అప్డేట్స్ అందించారు.
వెంటిలేటర్పైనే చికిత్స
ఎప్పటికప్పుడు శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుటపడుతూనే ఉందని వైద్యులు అంటున్నారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో కూడా అదే మాట అన్నారు. ప్రస్తుతం యాంటీ బయోటిక్స్ కూడా ఇవ్వడం ఆపేశామని తెలిపారు. కానీ ఇంకా వెంటిలేటర్పైనే శ్రీ తేజ్ చికిత్స కొనసాగుతుందని బయటపెట్టారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఈ మాత్రం అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు వైద్యులు. మొత్తానికి ఎప్పటికప్పుడు తన హెల్త్ బులెటిన్ను ఫాలో అవుతున్న ప్రేక్షకులు తను త్వరగా కోలుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా చికిత్స కొనసాగుతూ శ్రీ తేజ్ ఆసుపత్రి బెడ్పైనే ఉండడం చూసి వాపోతున్నారు.
Also Read: డబ్బుల కోసమే ఇదంతా .. శ్రీకాంత్ ను నమ్మి మోసపోయాను..?
ఏం జరిగిందంటే.?
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదల కాగా.. దానికంటే ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 4న ఈ మూవీకి పెయిడ్ ప్రీమియర్స్ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ పెయిడ్ ప్రీమియర్స్ను తన ఫ్యాన్స్తో కలిసి చూడాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నాడు. అంతా బాగానే ఉన్నా అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్కు వస్తున్నాడనే విషయం ముందుగానే బయటపడింది. దీంతో భారీగా ఫ్యాన్స్ అక్కడికి చేరుకున్నారు. అది తెలియని ఈ హీరో.. థియేటర్కు చేరుకోవడానికి రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్ షో చూసి మరికొంత మంది ప్రేక్షకులు టికెట్లు లేకపోయినా థియేటర్లకు వచ్చేశారు. అలా థియేటర్లో సరిపడా కంటే ఎక్కువ జనాలు వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది. దానివల్లే శ్రీ తేజ్కు ఇలా జరిగింది.
త్వరగా కోలుకోవాలి
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ముందుగా శ్రీ తేజ్ (Sri Tej) తల్లి రేవతి మరణించింది. దాంతోనే అక్కడి పోలీసులు అలెర్ట్ అయ్యారు. అప్పటికే శ్రీ తేజ్ కూడా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నాడని గమనించారు. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యి సీపీఆర్ చేసిన వీడియోలు సైతం వెంటనే సోషల్ మీడియాలో బయటికొచ్చి వైరల్ అయ్యాయి. అలా సమయానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల శ్రీ తేజ్కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. ఇప్పటికీ శ్రీ తేజ్ వెంటిలేటర్పై ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నాడు. అందుకే తను త్వరగా కోలుకోవాలని కోరుకునేవారి సంఖ్య చాలానే ఉంది.