Sunny Deol: ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు. ఎలాంటి సినిమా తెరకెక్కించినా, అందులో ఎంత పెద్ద స్టార్ ఉన్నా కూడా కథ నచ్చకపోతే ప్రేక్షకులు దానిని డిశాస్టర్ చేసేస్తున్నారు. ఇక బాలీవుడ్తో పోలిస్తే సౌత్ సినిమాలే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా వ్యాప్తంగా హిట్లు అవుతున్నాయి. దీంతో బాలీవుడ్ దృష్టి మొత్తం టాలీవుడ్పైనే ఉంది. అలా బాలీవుడ్ సీనియర్ హీరో అయిన సన్నీ డియోల్ సైతం తెలుగులో డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యాడు. త్వరలోనే ‘జాట్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా సన్నీ డియోల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
పరిస్థితి మారిపోయింది
ఇప్పటికే సౌత్ను, బాలీవుడ్ను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు సన్నీ డియోల్. తెలుగులో నిర్మాతలు.. దర్శకులకు ఫ్రీడమ్ ఇస్తారని ఓపెన్గా చెప్పేశాడు. క్వాలిటీ లేని కంటెంట్ తెరకెక్కించడం వల్లే హిందీ సినిమాలు హిట్ అవ్వడం లేదని అన్నాడు. తాజాగా మరోసారి తాను అన్న మాటలు నిజమే అని చెప్పుకొచ్చాడు సన్నీ డియోల్. సినిమాలు తెరకెక్కించే విషయంలో మేకర్స్ టేస్ట్ పూర్తిగా మారిపోతుందని, క్వాలిటీ కథలను ప్రేక్షకులకు అందించాలనే దృష్టితో ఎవరూ పనిచేయడం లేదని అన్నాడు ఈ సీనియర్ హీరో. ఒకప్పుడు సౌత్ సినిమాలు బాలీవుడ్ నుండే ఫిల్మ్ మేకింగ్ను నేర్చుకున్నాయని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని గుర్తుచేసుకున్నారు.
వాటిపైనే ఫోకస్
ఇప్పుడు సౌత్ పరిశ్రమలే బాలీవుడ్ను దాటేసి దూసుకుపోతున్నాయని అన్నాడు సన్నీ డియోల్. అందుకే తెలుగు సినిమాలను రీమేక్ చేయడంపైనే బాలీవుడ్ ఫోకస్ చేస్తుందని తెలిపాడు. చాలామంది చేతులు కలిస్తేనే ఒక వంట పాడవుతుందని అంటుంటారు, ఇప్పుడు బాలీవుడ్లో అదే జరుగుతుందని ఉదాహరణ చెప్పాడు. సినిమాల విషయంలో కథ అనేది కింగ్ అని, దర్శకుడు అనేవాడు బాస్ అని అన్నాడు. కథ, దర్శకుడి ప్రకారమే నటీనటులంతా పనిచేయాలి, కానీ పరిస్థితి మారిపోయిందని వాపోయాడు. సినిమా విషయంలో ప్రతీ ఒక్కరు జోక్యం చేసుకొని ఎవరి అభిప్రాయాలు వారు చెప్తున్నారని, దాని వల్లే తప్పులు జరుగుతున్నాయని ఓపెన్ కామెంట్స్ చేశాడు సన్నీ డియోల్.
Also Read: ‘లాపతా లేడీస్’ ఆ సినిమాకు కాపీనా.? ఇదెక్కడి మాస్ ట్విస్ట్ మావా.!
హత్తుకునే కథలు కావాలి
ప్రేక్షకులు మంచి కథలను మాత్రమే ఆదరిస్తారని సన్నీ డియోల్ (Sunny Deol) సైతం గ్రహించినట్టు తెలిపాడు. మనసును హత్తుకునే కథల కోసం వారు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారని అన్నాడు. అలాంటి కథలు ఇప్పుడు బాలీవుడ్లో రావడం లేదని ఓపెన్గా చెప్పేశాడు. కానీ తను నటించిన ‘జాట్’ (Jaat) మాత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. ఇందులో మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయని రివీల్ చేశాడు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నటించిన చిత్రమే ‘జాట్’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా ఏప్రిల్ 10న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.