Tollywood Film Chamber1932 ఫిబ్రవరి 6వ తేదీన పూర్తి నిడివి కలిగిన తెలుగు సినిమా విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈరోజును తెలుగు సినిమా ఇండస్ట్రీ పుట్టినరోజుగా ప్రకటించింది తెలుగు ఫిలిం ఛాంబర్. ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించగా.. ఆ సమావేశంలో సీనియర్ నటులు మురళీమోహన్ (Murali Mohan), రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna), దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ (Veera Shankar), రచయిత జర్నలిస్ట్ రెంటల జయదేవ్ (Rentala Jayadev), ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్(Bharath Bhushan), సెక్రటరీ ప్రసన్న కుమార్(Prasanna Kumar) తదితరులు ఇందులో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవం గా ప్రకటించి, కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఫిలిం ఛాంబర్ అవార్డులపై కీలక ప్రకటన..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఫిబ్రవరి 6వ తేదీన పూర్తి నిడివి కలిగిన ‘భక్త ప్రహ్లాద’ సినిమా విడుదలైన నేపథ్యంలో.. సినిమా పుట్టి 93 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది ఫిలిం ఛాంబర్. అందులో భాగంగానే ఇకపై ప్రతి ఏడాది కూడా ఫిలిం ఛాంబర్ నుండి నటీనటులకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఇదే రోజున ప్రతి ఏడాది వేడుకలు నిర్వహించి, ఆ వేడుకలలో అవార్డులు ప్రధానం చేయనున్నారట. ఇక ప్రతి ఏటా ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం ఛాంబర్ నుంచి కూడా అవార్డులు ఉంటాయని తెలిపారు. అలాగే తెలుగు సినిమా పుట్టిన సందర్భంగా ఈరోజు ప్రతి సినిమా నటుడు తన ఇంటి పైన అలాగే థియేటర్ల వద్ద ప్రత్యేకంగా తెలుగు జెండా ఆవిష్కరించాలని, ఆ జెండా రూపకల్పన బాధ్యతను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణకి కూడా అప్పజెప్పారు. ఇకపోతే ఈరోజు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై పలు ప్రశ్నలు వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.
తలెత్తుతున్న కొత్త ప్రశ్నలు..
ఈ మేరకు ఫిలిం ఛాంబర్ పుట్టినరోజు నాడు ప్రతి ఏడాది అవార్డులు అందజేస్తాము అని ప్రకటించడంతో ఎందుకు అవార్డ్స్..? ఎవరికీ అవార్డులు.. ? ఈ నిర్ణయాలు కొత్త వసూలు దందాకు తెరతీసే ప్రయత్నం కాదా? మాకు మేమే అవార్డు ఇచ్చుకుంటామంటే అసలు న్యాయ నిర్ణయం ఎలా జరుగుతుంది? ప్రభుత్వ అవార్డులకే సవాలక్ష రాజకీయ కారణాలు..? పైరవీలు.. లాబీయింగ్ లు.. పైగా ఆరోపణలు కూడానూ..? అలాంటిది ఫిలిం ఛాంబర్ కు ఈ అవార్డ్స్ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇండస్ట్రీలో వివాదాలు చెలరేగినప్పుడు ఇండస్ట్రీ పెద్దలు అందరూ సైలెంట్ అయిపోతారు? అవసరం లేని వాటికి మాత్రం ఎగిరెగిరి పడతారు.? ప్రభుత్వాలు ఇచ్చేవి ఇచ్చుకుంటాయి కదా.. వాటితో సంబంధం లేదు అంటారు.. అవన్నీ గౌరవం లేని మాటలు కాదా.. ప్రభుత్వం అంటే అంత చులకన ఎందుకు.. ? సినీ ఇండస్ట్రీ వాళ్ళు చేసే విమర్శలు, ఆరోపణలు , బాధలు భరించలేకనే ఈ అవార్డులపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనకంజ వేస్తున్నాయి.. ఛాంబర్ పెద్దలారా!! ఇకనైనా ప్రభుత్వాలతో మాట్లాడి, ప్రతి ఏటా అవార్డులు ఇచ్చేలా ముందు బాధ్యతగా పనిచేయండి. ఆ తర్వాత మీ ప్రజ్ఞా పాటవాలు ప్రదర్శిద్దురు కానీ.. అంటూ అటు నెటిజన్స్ నుండి కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.