Vijay Devarakonda: ప్రస్తుతం సెలబ్రిటీల చుట్టూ బెట్టింగ్ యాప్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎప్పుడో ఈ యాప్స్ను ప్రమోట్ చేసినా కూడా వారందరినీ వెతికి పట్టుకొని మరీ వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. అంతే కాకుండా వారిపై యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అయితే ముందుగా ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్పై ఫోకస్ పెట్టారు అధికారులు. ఆ తర్వాత కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్ యాప్స్ వంటి వాటిని ప్రమోట్ చేశారని గమనించి వారిపై కూడా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు కూడా ఉంది.
ప్రమోట్ చేయడం నిజమే
బెట్టింగ్ యాప్స్ను విజయ్ దేవరకొండ కూడా ప్రమోట్ చేశాడని, తనపై కూడా కేసు నమోదు అయ్యిందని సోషల్ మీడియాలో ప్రసారం సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి తన టీమ్ ముందుకొచ్చింది. ఇవన్నీ అసత్య వార్తలు అంటూ కొట్టిపారేసింది. ఆన్లైన్ గేమ్స్ను విజయ్ ప్రమోట్ చేయడం నిజమే అని, కానీ తను కేవలం స్కిల్ బేస్డ్ గేమ్స్ మాత్రమే ప్రమోట్ చేశాడని తన టీమ్ చెప్పుకొచ్చింది. తను ప్రమోట్ చేసిన కంపెనీలు కూడా ఆ గేమ్స్ను చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని అన్నారు. ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్కు అధికారికంగా అనుమతి అందించిన ప్రాంతాలలో మాత్రమే విజయ్ దేవరకొండ వాటిని ప్రమోట్ చేశాడని క్లారిటీ ఇచ్చారు.
లీగల్ అయితేనే చేస్తా
విజయ్ దేవరకొండ మాత్రమే కాదు.. ఏ సినీ సెలబ్రిటీ అయినా ఒక బ్రాండ్ను ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు వారి పర్సనల్ టీమ్ దాని గురించి అన్ని వివరాలు సేకరిస్తుంది. అది లీగల్ అనిపిస్తేనే చాలామంది సెలబ్రిటీలు వాటిని ప్రమోట్ చేయడానికి ముందుకొస్తారు. ఒకవేళ అది లీగల్ కాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయనే విషయం చాలామందికి క్లారిటీ ఉంటుంది. ఇక విజయ్ దేవరకొండ కూడా ఏ యాడ్ అయినా చేసే ముందు ఆ కంపెనీ లీగలా కాదా అని ఆయన టీమ్ క్షుణ్ణంగా పరీక్షిస్తుందట. కంపెనీ లీగల్ అని కన్ఫర్మ్ అయిన తర్వాతే విజయ్ దానిని ప్రమోట్ చేయడానికి ముందుకొస్తాడని తన టీమ్ చెప్తోంది.
Also Read: మాస్టర్కు దబిడి దిబిడి.. మహిళా సంఘాల నుండి అదిదా సర్ప్రైజ్
అగ్రిమెంట్ ముగిసింది
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లీగల్ కంపెనీ అని కన్ఫర్మ్ అయిన ‘ఏ 23’ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాడు. అది ఒక ఆన్లైన్ రమ్మీ గేమ్. ఇక రమ్మీ అనేది స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో ఒకసారి సుప్రీం కోర్టు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు రమ్మీ ప్రమోట్ చేసిన వారిపై కేసులు నమోదు చేయడం కరెక్ట్ కాదని కొందరు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ‘ఏ 23’తో విజయ్ అగ్రిమెంట్ గతేడాది ముగిసింది. ఇప్పుడు తనకు, ఆ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. అలా విజయ్ దేవరకొండపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తన టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. తను ఏ అనాధికారిక కంపెనీని ప్రమోట్ చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చింది.