Earthquake: ఓ వైపు అగ్నిపర్వతాలు.. ఇంకోవైపు భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందేమోనని బెంబేలెత్తుతున్నారు. తాజాగా శనివారం తెల్లవారుజామున ఇండోనేషియా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది. పరిస్థితి గమనించిన అక్కడి అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపంలో శనివారం తెల్లవారుజామున దాదాపు 5 గంటల సమయంలో 7.7 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ అయ్యాయి. దీవుల చుట్టూ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని యూఎస్ జియోలాజికల్ సర్వే-ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. ఇండోనేషియా తీరానికి దూరంగా 35 కిలోమీటర్ల లోతులో బలమైన భూకంపం సంభవించింది. EMSC నివేదిక ప్రకారం కనీసం మూడు ప్రకంపనలు నమోదయ్యాయి. అదే ప్రాంతంలో రెండోది 6.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తీర-నదీ పరివాహక ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని ఆదేశించారు. 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో కెరటాలు ఎగసిపడే అవకాశముందని అంచనా వేశారు అధికారులు. ఈ భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణనష్టంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. భూమి లోపల కదలిక ఇంకా ఆగలేదని, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భూకంపం వల్ల ఏ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందో అంచనా వేస్తున్నాయి. దీనివల్ల ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి, దాని చుట్టూ ఉన్న ద్వీపాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సునామీ సంస్థ స్పష్టంచేసింది. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, తదుపరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
ALSO READ: స్వాతంత్రం రోజున కూడా.. ప్రజల్ని వదలని పాక్.. ఇంధన ధరలు పెంచి బిగ్ షాక్!
జపాన్ నుండి ఆగ్నేయాసియా మీదుగా పసిఫిక్ బేసిన్ అంతటా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఇండోనేషియా, దాని పొరుగు దేశాలు ఉన్నాయి. అక్కడ తరచుగా భూకంపాలు సంభవించడం సర్వసాధారణం. ఈ ప్రాంతం భూకంప కార్యకలాపాలకు అత్యంత అనుకూలమైనది. ఇండోనేషియాలో అత్యంత ఘోరమైన భూకంపం 2004 లో సంభవించింది. సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపంలో దాదాపు లక్షలాది మంది మరణించిన విషయం తెల్సిందే.