Israel’s war on Gaza updates(Today’s international news): రావణకాష్టంగా మారుతున్న పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ కాస్త మెత్తబడింది. రంజాన్ నెల 40 రోజుల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. దీనికోసం పొరుగుదేశమైన ఈజిప్టుతో బాటు ఖతార్ దేశాలు కొన్నాళ్లుగా ఇజ్రాయెల్తో చర్చలు జరుపుతున్నాయని, దీనిపై రేపో మాపో ఒక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. తమ ప్రతిపాదనకు పాలస్తీనా ఒప్పుకుంటే.. రంజాన్ నెలలో అన్ని రకాల మిలిటరీ చర్యలకు తాము దూరంగా ఉండటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇజ్రాయెల్ ప్రతినిధి చెప్పినట్లుగా రాయిటర్స్ వార్తాసంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఈ ఒప్పందం మేరకు హమాస్ చెరలో ఉన్న, పాలస్తీనా జైళ్లలో ఉన్న తమ దేశానికి చెందిన బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరినట్లు, ఈ అంశాన్ని హమాస్, పాలస్తీనాలు పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ కథనం వ్యాఖ్యానించింది. అయితే.. దీనిపై హమాస్,పాలస్తీనా స్పష్టమైన నిర్ణయం తీసుకునే విషయంలో ప్రతిష్టంభన నెలకొనే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ.. ఈ ప్రతిపాదనకు హమాస్, పాలస్తీనాలు ముందుకొస్తే.. రంజాన్ 40 రోజులు శాంతి నెలకొనే అవకాశం ఉందని, రెండు రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రావచ్చని ఆ కథనం తెలిపింది.
Read more: నైలు నదిలో పడవ బోల్తా .. 19 మంది మృతి
తమ షరతులకు పాలస్తీనా, హమాస్ ఒప్పుకుంటే.. గాజా మీద రంజాన్ నెలలో రోజులో 8 గంటల పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ నిఘాను విరమించుకోవటం, గాజాలోకి మానవతా సాయం కింద రోజుకు 500 ట్రక్కులను అనుమతించటం, యుద్ధం కారణంగా సర్వం కోల్పోయిన పౌరులు, శరణార్థి శిబిరాల్లో తలదాచుకునే వారికి 2 లక్షల గుడారాలు, 50 వేల తాత్కాలిక నివాసాల ఏర్పాటుకు కూడా ఇజ్రాయెల్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.