US Car Attack : అమెరికాలో నూతన ఏడాది సంబరాల వేళ దారుణం చోటుచేసుకుంది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమూహాన్ని టార్గెట్ గా చేసుకుని.. వేగంగా కారుతో ఢీ కొట్టించాడో నిందితుడు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు.. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన అమెరికా పోలీసులు.. ఘటనకు కారణమైన వ్యక్తిపై కాల్పులు జరిపినట్లు తెలిపారు.
అమెరికాలోని సెంట్రల్ న్యూ ఓర్లీన్స్లో ప్రజలంతా ఆనందంగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉండగా.. వేగంగా దూసుకువచ్చిన ఓ కారు భీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 3.15 గంటలకు బోర్బన్ స్ట్రీట్ లోని ఐబెర్విల్లే కూడలి దగ్గర ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతం.. రాత్రి వేడుకలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మ్యూజిక్, రెస్టారెంట్లు పర్యాటకులతో పాటు స్థానికుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది వస్తుంటారు. అలాంటి చోట కావాలనే కారుతో గుద్దేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
వేడుకలు జరుగుతున్న చోట అడ్డుగా పెట్టిన బారికేట్లను వేగంగా, బలంగా ఢీ కొట్టిన నిందితుడు.. వీలైనంత ఎక్కువ మందిని చంపేందుకు ప్రయత్నించాడు. కారుతో గుద్దిన తర్వాత తుపాకీతో కారు దిగిన నిందితుడు.. ప్రజల గుంపు మీదకి విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో.. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. అప్పటికే.. అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోగా.. ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 35 మంది తీవ్ర గాయాలపాలైయ్యారు. వీరిని చుట్టుపక్కల అందుబాటులో ఉన్న నాలుగైదు ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన తీవ్రత దృష్య్టా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) ఈ కేసును టేకోవర్ చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో డ్యూటీలో 300 మందికి పైగా అధికారులు పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఇంకా పూర్తిగా క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియలేదు.
న్యూ ఓర్లిన్ స్ట్రీట్ లో గతంలోనూ కొన్ని ప్రమాదాలు జరిగాయి. 2024 నవంబర్ లో వేలాది మంది వేడుకల్లో ఉండగా జరిగిన రెండు వేరువేరు కాల్పుల ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. అలాగే.. ఫిబ్రవరి 2017లో న్యూ ఓర్లీన్స్లోని ప్రధాన మార్డి గ్రాస్ పరేడ్ని చూస్తున్న ప్రేక్షకుల గుంపుపైకి బాగా మత్తులో ఉన్న ఓ వ్యక్తి పికప్ ట్రక్ తో దూసుకుపోగా.. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు.
Also Read : హోటల్ గదిలో ఐదుగురు యువతుల హత్య.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ లో దారుణం.. ఏమైందంటే
ఎమర్జెన్సీ టీమ్లు ప్రమాద స్థలంలో సహాయక చర్యల్లో ఉన్న కారణంగా.. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ప్రయాణించకుండా ఉండాలని పోలీసులు ప్రజలను కోరారు. కాగా.. ఈ ఘటన వెనుక కారణాలను అన్వేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.