Gaza Famine | ఇజ్రాయెల్తో యుద్ధంలో గాజాలో ఎందరో అమాయక పౌరులు సమిధలుగా మారుతున్నా పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించట్లేదు. ఇక, యుద్ధం కారణంగా గాజాలో కరువు కమ్ముకుంటోంది. తినడానికి తిండిలేక ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. లక్షల మంది తీవ్ర ఆహార కొరత బారిన పడుతున్నట్టు ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు, ఎన్జీవోలు గగ్గోలు పెడుతున్నాయి.
ప్రపంచంగా వివిధ దేశాల్లో ఆహార భద్రతను ముదింపు వేసే ఇంటిగ్రేటడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (Integrated Food Security Phase Classification ఐసిపి) గాజా పరిస్థితిపై ఇప్పటికే పలుమార్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కరువు అంచున ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అయితే, అక్కడి పరిస్థితులపై అధికారికంగా సమాచారం సేకరించే అవకాశం లేకపోవడంతో క్షామం నెలకున్నట్టు ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా చిన్నారులతో సహా అనేక మంది తిండిలేక అలమటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వలంటీర్లుగా సేవలందిస్తున్న అనేక మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది అక్కడి పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
అన్ని ప్రాంతాల్లో పోషకాహారం లోపం కనిపిస్తుందని తెలిపారు. చిన్నారులకు విటమిన్స్, మినరల్స్ లేని బ్రెడ్ అన్నం మాత్రమే దొరుకుతున్నాయని, ఇది వారి ఆరోగ్యం ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. పేషంట్ల ఎక్కువైపోతుండటంతో ఆసుపత్రులు తగిన వైద్య సేవలు అందించలేకపోతున్నాయని చెప్పారు. పోషకాహారం, తత్సంబంధిత అనారోగ్యాల కారణంగా ఎందరో మృత్యువాత పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
రణరంగంగా మారిన గాజాలో ప్రజల స్థితిగతులపై అధికారికంగా సమాచారం సేకరించలేని కారణంగా ఐపీసీ లాంటి సంస్థలు క్షమాం నెలకున్నట్టు ప్రకటించలేకపోతున్నాయి. పౌష్టికాహారంలోపం, తద్వరా సంభవిస్తున్న మరణాల గురించి అంతర్జాతీయ సంస్థల వద్ద కావాల్సిన సమాచారం లేదు. నిత్య దాడుల కారణంగా క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ ప్రమాదకరంగా మారింది. మానవతా సాయం చేర్చడంలో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే, కరువు ప్రకటించడానికి ఐసిపి అనుసరిస్తున్న విధానంతో యుద్ధ ప్రాంతాలకు అనువైనది కాదని చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో సేకరించే గణాంకాలను యుద్ధ ప్రాంతాలకు వర్తింపచేయలేమని అంటున్నారు. వాస్తవ పరిస్థితులను అనుసరించి కొత్త విధానాన్ని అమల్లోకి తేవాలని కూడా నిపుణులు ఐసిపికి సూచిస్తున్నారు.
యుద్ధ విరమణ చేయాలంటూ ఇప్పటికే ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇక గాజాలో కరువు నెలకొన్నట్టు అధికారిక ప్రకటన వెలువడితో ఇజ్రాయెల్ మరింత ఇరకాటంలో పడుతుంది. గాజాలోకి మానవతాసాయం అందించాలంటూ వివిధ దేశాలు పట్టుపట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను ధిక్కరిస్తూ ఇజ్రాయెల్ ముందుకు వెళితే చివరకు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం గాజా వాసులకు అంతర్జాతీయ సంస్థలు, దేశాల నుంచి మానవతాసాయం అందుతున్నా అది స్థానిక అవసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదని క్షేత్రస్థాయిలో ఉన్న వలంటీర్లు చెబుతున్నారు. కరువు నెలకొన్నట్టు అధికారికంగా ప్రకటిస్తే తప్ప గాజాకు కావాల్సి స్థాయిలో మానవతాసాయం అందదని స్పష్టం చేస్తున్నారు. పరిస్థితి విషమిస్తున్నా ఐసిపి తన నిబంధనలను సవరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో ప్రపంచమంతా కలిసికట్టుగా గాజాను ఆదుకునేందుకు ముందుకు రావాలని మానవతావాదులు పిలుపునిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకూ 45 వేల పైచిలుకు మంది కన్నుమూశారని పాలస్తీనా అధికారులు చెబుతున్నారు. మరెంతో మంది ప్రాణాలను చేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.