UN on Arvind Kejriwal’s Arrest: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సార్వత్రిక ఎన్నికల ముందు అరెస్ట్ కావడం ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యం కలిగించింది. కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా, జర్మనీలు స్పందించగా.. ఈ దేశాలకు భారత్ గట్టిగానే బదులుచెప్పింది. అయితే ఈ వ్యవహరంపై వాటికి భారత్ బదులిచ్చిన ఒక్కరోజు తర్వాత.. ఏకంగా ఐక్యరాజ్య సమితి సైతం స్పందించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత్ సహా ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లోనూ ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోని గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలోనైనా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం ప్రజలకు ఉంటుందని తాము ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో దేశంలో నెలకొన్న పరిస్థితులపై డూజారిక్ ను ఓ విలేఖరి అడగగా ఆయన పై విధంగా స్పందించారు. దీంతో ఈ విషయం మరోసారి ప్రపంచ దేశాలకు చర్చనీయాంశంగా మారింది.
కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటికే జర్మనీ, అమెరికా వంటి అగ్రదేశాలు స్పందించాయి. అయితే అమెరికా కేజ్రీవాల్ అరెస్ట్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనపై కూడా వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇది భారత్ అంతర్గత వ్యవహారం అని.. వీటిలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని భారత ప్రభుత్వం ఆ దేశాలకు వెల్లడించింది.
Also Read: Crypto King Sam Bankman jail: ఒకప్పుడు కింగ్.. తప్పుచేశాడు.. 25 ఏళ్ల జైలుశిక్ష
భారత అంతర్గత విషయాలను, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని గట్టిగానే సమాధానం చెప్పింది. ఈ విషయంలో అమెరికా రెండోసారి వ్యాఖ్యలు చేయడంతో ఆ దేశ దౌత్యవేత్తకు కూడా సమన్లు జారీ చేసింది. అయితే ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి కూడా స్పందించడంతో భారత్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.