Egypt Pyramids: ఈజిప్టులోని గిజా ఎడారిలో వేల ఏళ్లుగా నిలిచిన పిరమిడ్లు నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఆధునిక యంత్రాలు, క్రేన్లు, కంప్యూటర్లు లేని కాలంలో ఇంతటి భారీ రాతి కట్టడాలను మనుషులు ఎలా నిర్మించారు? టన్నుల కొద్దీ బరువున్న రాళ్లను ఎలా తరలించారు? వాటిని అంత ఎత్తుకు ఎలా చేర్చారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్న కొద్దీ.. పురాతన ఈజిప్షియన్ల ఇంజనీరింగ్ నైపుణ్యం ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది.
మరి ఈ మహాకట్టడాల వెనుక అసలు రహస్యం ఏమిటి? కొందరు చెబుతున్నట్టుగా పిరమిడ్ల నిర్మాణంలో గ్రహాంరవాసుల ప్రమేయం ఉందా? ఇంతకీ ఈ కట్టడాల నిర్మాణం వెనుకు ఉన్నీ సీక్రెట్ ఏమిటీ.. వంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం రండి..
పిరమిడ్ల నిర్మాణం వెనుక గ్రహాంతరవాసులు ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలోనూ, కొన్ని పుస్తకాల్లోనూ తరచూ కనిపిస్తూ ఉంటుంది. మనుషులు అంతటి ఖచ్చితత్వంతో వీటిని కట్టడం సాధ్యం కాదని, పైనుంచి వచ్చిన వేరే లోకం జీవులే వీటిని నిర్మించారని కొందరు నమ్ముతారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం ఊహాగానాలు, మనుషుల శ్రమను తక్కువ చేసి చూపించే కథనాలు మాత్రమే. శాస్త్రవేత్తలు, పురావస్తు పరిశోధకులు సేకరించిన నిజమైన ఆధారాలు ఈ గ్రహాంతరవాసుల వాదనను పూర్తిగా తోసిపుచ్చుతున్నాయి.
పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లను అక్కడికి దగ్గరలోని రాతి గనుల నుంచి సేకరించారు. ఒక్కో రాయి బరువు సగటున రెండున్నర టన్నుల పైమాటే ఉంటుంది. ఆ కాలంలో ఉన్న రాగి సాధనాలు, చెక్క గునపాలు, రాతి సుత్తులు ఉపయోగించి రాళ్లను సరైన ఆకారంలో కత్తిరించారు. అలా కత్తిరించిన భారీ రాళ్లను చెక్క బండ్లపై ఉంచి, మనుషులే తాళ్లతో లాగుతూ నిర్మాణ స్థలానికి తీసుకువెళ్లేవారు. మార్గమధ్యంలో రాపిడిని తగ్గించడానికి బండి ముందు భాగంలో నీటిని చల్లుతూ ఇసుకను మెత్తగా చేసేవారని ఆధారాలు చెబుతున్నాయి.
Also Read: ఆపరేషన్ బార్బరోస్సా.. హిట్లర్ చేసిన ఆ ఒక్క పొరపాటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితాన్ని మార్చేసిందా?
అంత ఎత్తుకు అంతటి బరువైన రాళ్లను ఎలా తీసుకెళ్లారనే దానికి పరిశోధకులు శాస్త్రీయ వివరణ ఇచ్చారు. పిరమిడ్ల చుట్టూ ఇసుక, మట్టి, రాళ్లతో వాలుగా ఉండే మార్గాలను (ర్యాంపులను) ఏర్పాటు చేశారు. పిరమిడ్ ఎత్తు పెరుగుతున్న కొద్దీ ఈ వాలు మార్గాల ఎత్తును కూడా పెంచుకుంటూ పోయేవారు. ఈ వాలు మార్గాలపై చెక్క బండ్లను ఉంచి రాళ్లను పైకి లాగడం ద్వారా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని పాతకాలపు ర్యాంపుల అవశేషాలు ఈ విధానాన్ని స్పష్టంగా ధృవీకరిస్తున్నాయి.
చాలామంది అనుకునేటట్లు పిరమిడ్లను బానిసలతో కట్టించలేదు. వేలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులు, శిల్పులు, మేస్త్రీలు ఈ పనిలో పాల్గొన్నారు. వారి కోసం నిర్మాణ స్థలానికి సమీపంలోనే ప్రత్యేకమైన గ్రామాలు, వైద్య వసతులు, ఆహార సదుపాయాలు ఏర్పాటు చేశారు. తవ్వకాల్లో దొరికిన కార్మికుల అస్థిపంజరాలను పరిశీలించగా, వారికి గాయాలైనప్పుడు వైద్యం అందించిన గుర్తులు కూడా కనిపించాయి. ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో, పక్కా మేనేజ్మెంట్తో రాజుల ఆజ్ఞ మేరకు ఈ నిర్మాణాలు సాగాయి.
పిరమిడ్లు అనేవి గ్రహాంతరవాసుల మాయాజాలం కావు, కేవలం పురాతన ఈజిప్షియన్ల అపారమైన మేధస్సుకు, ఇంజనీరింగ్ ప్రతిభకు, వేలాది మంది కార్మికుల కష్టానికి సజీవ సాక్ష్యాలు. సహజసిద్ధమైన భౌతిక సూత్రాలను, అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి వారు సాధించిన ఈ అద్భుతం మానవ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
Also Read: వారానికి 2 రోజులే పని.. నెలకు లక్షల్లో సంపాదన, ఈ 22 ఏళ్ల కుర్రాడి బిజినెస్ స్ట్రాటజీ తెలిస్తే..