Iran: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాల కారణంగా అనేక దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో గతంతో పోల్చుకుంటే ఇండియా కరెన్సీ కూడా తగ్గింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్థిక సంక్షోభంతోపాటు ఇలాంటి పరిస్థితిని ఇరాన్ కూడా ఎదుర్కొంది. దీంతో ఇరాన్ పార్లమెంట్ ఆదివారం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఏకంగా ఆర్థిక మంత్రి అబ్దుల్ నాసర్ హిమ్మతిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ తీర్మానం ద్వారా ఆయనను పదవి నుంచి తొలగించారు. ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం, ఆర్థిక నిర్వహణలో లోపాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలో 273 మంది ఎంపీలలో 182 మంది హిమ్మతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగర్ ఖలీబాఫ్ ప్రకటించారు.
ఈ అభిశంసన ప్రక్రియలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పజ్కియాన్ తన ఆర్థిక మంత్రిని సమర్థించారు. కానీ చివరకు 182 మంది ఎంపీలు ఆయనను తొలగించడానికి ఓటు వేశారు. మసౌద్ పెజెష్కియాన్ మంత్రివర్గం అధికారం చేపట్టిన ఆరు నెలల తర్వాత ఈ తొలగింపు జరిగింది. దీంతో ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు
2024 మధ్యలో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ బ్లాక్ మార్కెట్లో 920,000కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 600,000గా ఉన్న విలువ కంటే చాలా ఎక్కువ. అధ్యక్షుడు మసౌద్ పజ్కియాన్ ఆర్థిక సంస్కరణలను తీసుకురావాలని, పాశ్చాత్య ఆంక్షలను ఎత్తివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ పరిస్థితి క్రమంగా మరింత దిగజారింది. డిసెంబర్ 2024లో సిరియాలో బషర్ అల్-అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంక్షోభం తీవ్రతరం కావడంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడింది.
Read Also: Farmers: రైతులకు గుడ్ న్యూస్.. రూ.5కే కరెంట్ కనెక్షన్..
2018 నుంచి ఇరాన్.. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల నుంచి కఠినమైన ఆంక్షలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్షుడైన తర్వాత ఇరాన్పై మరిన్ని కఠినమైన ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా ఇటీవల ఇరాన్ చమురు వ్యాపారంపై కొత్త ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగింది.
ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం 2019 నుంచి ఇరాన్లో ద్రవ్యోల్బణం రేటు స్థిరంగా 30% పైగా ఉంది. 2023లో ఈ రేటు 44%కి చేరుకుంది. ఈ కారణంగా ఏప్రిల్ 2023లో ఇరాన్ పార్లమెంట్ అప్పటి పరిశ్రమల మంత్రి రెజా ఫతేమిని కూడా తొలగించింది. ఇరాన్లో ప్రస్తుత పరిణామాలు ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం, అంతర్జాతీయ రాజకీయాలు కలసి దేశానికి మరింత కష్టాలను తెచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇరాన్ ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు అనేక మార్గాలను వెతుకుతోంది. కానీ ఇదే సమయంలో ప్రభుత్వానికి ఎదురైన సవాళ్లు మరింత పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు తమ ఆర్థిక భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంతోపాటు దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడం కూడా చాలా కీలకమని సూచిస్తున్నారు.