India Blocks Baglihar Dam water To Pakistan | పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ ను అన్ని దిక్కుల నుంచి ముట్టడి చేస్తోంది భారత్. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నేపథ్యంలో, తాజాగా చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాకిస్తాన్కు వెళుతున్న నీటి సరఫరాను కూడా నిలిపివేసింది. ఇది పాకిస్తాన్కు నీటి కొరతకు గురిచేసే రెండవ ప్రయత్నం. ఇదిలా ఉండగా.. అదే సమయంలో పాకిస్తాన్ ఒక ప్రత్యేక క్షిపణి ప్రయోగం పరీక్షను నిర్వహించిందన్న వార్త వెలుగులోకి వచ్చింది.
నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు డ్యామ్పై ఉన్న స్లూయిస్ స్పిల్వే గేట్లను క్రిందకు దించేశారు. దీని ఫలితంగా పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లోకి వస్తున్న నీటి సరఫరా ఆగిపోయింది. ఇది తాత్కాలిక చర్యగా తీసుకున్నదని అక్కడి ఒక అధికారి జాతీయ మీడియాకు తెలిపారు. అదే సమయంలో, అవసరమైతే భారత్ మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదన్న ఇది సంకేతమని వ్యాఖ్యానించారు.
చినాబ్ నదిపై ఈ డ్యామ్ను 2008లో 900 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మించారు. దీని పొడవు సుమారు 145 మీటర్లు. సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు అధిక వాటా ఉన్న నదుల్లో చినాబ్ నది ఒకటి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో రైతులు అధికంగా వ్యవసాయం కార్యకలాపాల కోసం ఈ నది నీటి పైనే ఆధారపడి ఉన్నారు.
ఏప్రిల్ 26న ఉగ్రదాడికి ప్రతిగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 29 నాటికి బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాక్కు వెళ్లే నీటి ప్రవాహం ఆగిపోయినట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టం అయింది. చినాబ్ నది సియాల్కోట్ వద్ద పూర్తిగా ఎండిపోయిందని ఉపగ్రహ చిత్రాల్లో కనిపిస్తోంది. పంజాబ్లో పత్తి, వరి సాగు ఈ నది నీటితోనే జరుగుతోంది.
Also Read: సాయం చేయండి ప్లీజ్.. భారత్ దాడికి భయపడి ఇతర దేశాలను అర్థిస్తున్న పాక్ ప్రధాని
ఇదే సమయంలో, గత వారం జీలం నది వరద ప్రవాహం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనకు గురిచేసింది. ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇది ముజఫరాబాద్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రజలకు నదీతీరాలకు వెళ్లవద్దని మసీదుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. జీలం నది అనంతనాగ్ జిల్లా మీదుగా పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతమైన చకోథికి చేరుతుంది.
డ్యామ్ పేల్చేస్తాం.. పాక్ మంత్రి వార్నింగ్
ఈ నేపథ్యంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ సింధు జలాలను మళ్లించే డ్యామ్ నిర్మాణం చేపడితే వాటిని పేల్చివేస్తామన్నారు. పహల్గాం ఘటన తరువాత సింధు ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచుతున్నాయి.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ జెండా ఉన్న ఓడలు భారత జలాల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పాక్కు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంది. పాక్కి చెందిన అన్ని రకాల మెయిల్స్, పార్సిల్ ఎక్స్ఛేంజీని నిలిపివేసింది. వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్పై ఆంక్షలు విధించింది. పాక్ జాతీయులు భారత్లో ఉండకూడదని వీసాలను కూడా రద్దు చేసింది.
1960లో భారత్ – పాక్ మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాక్ నాయకులు భారత్ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
పాక్ కూడా ప్రతీకార చర్యలతో భారత్ మీద నిషేధాలు విధించేందుకు పూనుకుంది. భారత జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను వాడకూడదని నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపై నిషేధం విధించనుంది. అలాగే పాక్ నౌకలు కూడా భారత్లోని పోర్టులకు వెళ్లకూడదన్న ఆంక్షలను విధించింది. పాకిస్తాన్ పట్ల భారత్ చేపడుతున్న చర్యల సమాధానంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పాక్ వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.