Anti-dumping Duty : దేశీయ తయారీ రంగాన్ని కాపాడుకునేందుకు భారత్ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవలే.. వివిధ వ్యవసాయ రంగ ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని ట్రంప్ వంటి నేతలు ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గని భారత్.. తాజాగా విదేశాల నుంచి తక్కువ ధరలకే దేశంలోకి ప్రవేశిస్తున్న ఐదు వస్తువులపై యాంటీ – డంపింగ్ సుంకాల్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే.. ఇండియాను సుంకాల రాజు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నా.. దేశీయ తయారీ రంగాన్ని రక్షించుకునేందుకు సుంకాల పెంపునకే భారత్ మొగ్గు చూపింది.
పొరుగున చైనా నుంచి పెద్ద మొత్తంలో ఉత్పత్తి అయ్యి దేశీయ విపణిలోకి చౌకగా అడుగుపెడుతున్న వాక్యూమ్ ప్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్ సహా ఐదు వస్తువులపై యాంటీ-డంపింగ్ సుంకాన్ని విధించింది. సాఫ్ట్ ఫెర్రైట్ కోర్లు, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్ – స్టాండర్డ్ మందం, అల్యూమినియం ఫాయిల్, ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్, పాలీ వినైల్ క్లోరైడ్ పేస్ట్ రెసిన్ వంటి ఉత్పత్తులను చైనా నుంచి భారతదేశానికి సాధారణ ధరల కంటే తక్కువకు ఎగుమతి అవుతుండడంతో ఈ సుంకాలు అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
సాఫ్ట్ ఫెర్రైట్ కోర్లు, వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్, ట్రైక్లోరో ఐసోసైన్యూరిక్ యాసిడ్ దిగుమతులపై విధించిన ఈ సుంకం రానున్న ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుందని కేంద్ర రెవెన్యూ శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్స్, కస్టమ్స్ శాఖ వేర్వేరు నోటిఫికేషన్లలో పేర్కొంది. ఆరు నెలల పాటు అల్యూమినియం ఫాయిల్పై టన్నుకు USD 873 వరకు యాంటీ-డంపింగ్ సుంకం తాత్కాలికంగా విధించనున్నట్లు తెలిపింది. చైనా, జపాన్ నుంచి నీటి శుద్ధి రసాయనాల దిగుమతులపై ప్రభుత్వం టన్నుకు 276 డాలర్ల నుంచి 986 డాలర్ల వరకు సుంకాన్ని విధించింది. సాఫ్ట్ ఫెర్రైట్ కోర్ల అంటే.. ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జర్లు, టెలికాం పరికరాలలో ఉపయోగించే ఈ ఉత్పత్తుల దిగుమతులపై, CIF అంటే ఖర్చు, భీమా సరుకు రవాణా విలువపై 35 శాతం వరకు సుంకం విధించనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా వాక్యూమ్ ఇన్సులేటెడ్ ఫ్లాస్క్పై టన్నుకు USD 1,732 యాంటీ-డంపింగ్ సుంకం విధించారు. పాలీ వినైల్ క్లోరైడ్ పేస్ట్ రెసిన్పై టన్నుకు USD 89 నుంచి USD 707 వరకు ఉన్న లెవీని చైనా, కొరియా RP, మలేషియా, నార్వే, తైవాన్, థాయిలాండ్ నుంచి దిగుమతులపై ఐదు సంవత్సరాల పాటు విధించారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్(DGTR) ఈ పన్నులకు సంబంధించిన సిఫార్సులను చేసిన తర్వాత ఈ సుంకాలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.
చౌక దిగుమతుల పెరుగుదల కారణంగా దేశీయ పరిశ్రమలు దెబ్బతిన్నాయో లేదో తెలుసుకోవడానికి దేశాలు యాంటీ-డంపింగ్ ప్రోబ్లను నిర్వహిస్తాయి. ప్రతిఘటనగా, వారు జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) బహుపాక్షిక పాలన కింద ఈ సుంకాలను విధిస్తారు. ఈ సుంకం న్యాయమైన వాణిజ్య పద్ధతులను నిర్ధారించడం, విదేశీ ఉత్పత్తిదారులు,ఎగుమతిదారులతో పోలిస్తే దేశీయ ఉత్పత్తిదారులకు సమాన స్థాయిని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. చైనాతో సహా వివిధ దేశాల నుంచి చౌక దిగుమతులను అరికట్టడానికి భారతదేశం ఇప్పటికే అనేక ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకాన్ని విధించింది.
Also Read : US Attacks on Houthi : హౌతీలపై ఆమెరికా భారీ దాడులు – మరో యుద్ధం వచ్చినట్లేనా.?
భారత్, చైనా రెండూ WTOలో సభ్యులు. చైనా భారత్ కి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండగా.. పొరుగు దేశంతో పెరుగుతున్న వాణిజ్య లోటుపై చైనా పదే పదే తీవ్రమైన ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు 2023-24లో USD 85 బిలియన్లుగా ఉంది.