Iran Reward: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ల మధ్య రోజురోజుకూ తీవ్ర ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ ఇరాన్ సైన్యం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. అమెరికా సైనికులను ప్రాణాలతో పట్టుకున్నా లేదా వారిని హతమార్చినా భారీ నజరానా ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
30 వేల డాలర్ల రివార్డ్.. మహిళలకు రెట్టింపు
ఇరాన్ సైనిక దళాల ప్రకటన ప్రకారం, అమెరికా సైనికుడిని బంధించినా లేదా అంతం చేసినా 30,000 డాలర్లు (రూ. 28 లక్షలు) రివార్డ్ అందించనున్నారు. అయితే ఈ ప్రకటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ పనిని ఇరాన్ మహిళలు సాధిస్తే, వారికి సాధారణ రివార్డుకు రెట్టింపు మొత్తాన్ని (రూ. 56 లక్షలకు పైగా) బహుమతిగా ఇస్తామని వెల్లడించడం. మహిళల్లో దేశభక్తిని, విప్లవాత్మక పోరాట స్ఫూర్తిని నింపడానికే ఈ ప్రత్యేక ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ప్రజల విజ్ఞప్తి మేరకే ఈ ప్రణాళిక
ఈ వినూత్న ప్రణాళిక వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ స్పష్టం చేశారు. తమ దేశ ప్రజల నుంచి వచ్చిన వరుస విజ్ఞప్తులు, విన్నపాలను పరిశీలించిన తర్వాతే సైన్యం ఈ నిర్ణయానికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అమెరికా బలగాల నుంచి ఎదురవుతున్న ముప్పును తిప్పికొట్టేందుకు సాధారణ పౌరులను, ముఖ్యంగా మహిళలను భాగస్వాములను చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికాతో సాగుతున్న ఈ దౌత్య, సైనిక ఘర్షణల్లో ఇరాన్ చేసిన ఈ తాజా ప్రకటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: వందేమాతరం వివాదం.. కేరళ కాంగ్రెస్ ప్రభుత్వంపై నితిన్ నబీన్ తీవ్ర ఆగ్రహం!