Imran Khan: గత కొద్ది కాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఇమ్రాన్ ను ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. మెరుగైన వైద్యం అందించాలని పాక్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పీటీఐ పార్టీ నాయకులు చాన్నాళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వెలువడిన ఆయన వైద్య నివేదికలను ఆధారంగా చూపుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోర్టును ఆశ్రయించారు. గత ఏడాది నుండి ఖాన్ కుమారులు కూడా తన తండ్రి ఆరోగ్యంపై నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే వచ్చారు.
కాగా, 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో పాక్ ప్రధాని పీఠం నుండి దిగిపోయారు. అనంతరం నమోదైన పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తూ 2023 ఆగస్టు నుండి జైలులోనే ఉంటున్నారు. జైలు జీవితం వల్ల ఆయన కుడి కంటి చూపు గణనీయంగా తగ్గిపోయిందని ఆయన న్యాయవాదులు ఇదివరకే వెల్లడించారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇమ్రాన్ ను జైలులోనే మగ్గిపోయేలా చేస్తున్నారని వారు వాదిస్తున్నారు.
Also Read: ‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!
మరోవైపు కోర్టు తీర్పుపై పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ స్పందించారు. ‘ఇది చాలా సంతోషించదగిన నిర్ణయం. ఈ ఉత్తర్వులు కాస్త ముందే వచ్చి ఉంటే ఆయన కంటి చూపు, సాధారణ ఆరోగ్యం ఇంతగా క్షీణించేవి కావు. వైద్యులందరూ ఆయన ఆరోగ్యంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసే వరకు ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందాలి’ అని పేర్కొన్నారు.
Also Read: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రత్యామ్నాయ మార్గాల పిటిషన్ కొట్టివేత