Iran Israel War : ఇరానే కదా తొక్కేద్దాం అనుకున్నారు. గెరిల్లా అటాక్తో ఆర్మీ చీఫ్ను లేపేశారు. విజయం మనదే అంటూ ఇజ్రాయెల్ సంబరపడింది. కానీ, దెబ్బతిన్న పులిలా ఇరాన్ తిరిగి దాడి చేసేసరికి గిలగిలా కొట్టుకుంటోంది. పాలస్తీనా మాదిరి ఇరాన్ అల్లాటప్పా దేశం ఏమీ కాదు. చైనా అండతో ఆ ఆర్మీ బలంగా ఉంది. క్షిపణులతో విరుచుకుపడింది. ఐరన్ డోమ్ను చేధించింది. పెద్ద చిల్లు పెట్టింది. ఇంకేం.. వరుసపెట్టి డ్రోన్లు, మిస్సైల్స్తో సవాల్ విసురుతోంది. రెచ్చిపోయిన ఇజ్రాయెల్.. ఇరాన్ అణుస్థావరంపై బాంబులు వేసింది. అయినా, బెదరలేదు ఇరాన్. ఈసారి ఏకంగా కొండను సైతం పిండి చేసే క్లస్టర్ బాంబ్స్ వేసింది. ఇటీవలే చైనా నుంచి 5 విమానాల్లో యుద్ధ సరంజామా ఇరాన్కు చేరిందని అంటున్నారు. కట్ చేస్తే.. అదిగో ఇదిగో ఇరాన్ను ప్రపంచపటంలో లేకుండా లేపేస్తాం అంటూ తెగ హడావుడి చేసిన ట్రంప్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. యుద్ధంలోకి దిగితే తమకొచ్చే లాభనష్టాలపై లెక్కలు వేసుకుంటోంది అమెరికా. ఇంతకీ అగ్రరాజ్యం భయపెడుతోందా? భయపడుతోందా?
అమెరికన్ యుద్ధవిమానాలు మాయం..
ఇరాన్పై యుద్ధానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధమవుతోందా? టెహరాన్కు సడెన్ షాక్ ఇచ్చేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తోందా? అందులో భాగంగానే ఖతార్లోని అల్ ఉదీద్ ఎయిర్బేస్లో ఉన్న మిలటరీ విమానాలను తరలిస్తోందా? అనే డౌట్స్ వస్తున్నాయి. శాటిలైట్ చిత్రాల ఆధారంగా చూస్తే జూన్ 5న అల్ ఉదీద్ వైమానిక స్థావరంలో 40 వరకు యూఎస్ యుద్ధ విమానాలు కన్పించగా.. ఈనెల 19 నాటికి కేవలం 3 ఫైటర్ జెట్స్ మాత్రమే అక్కడ ఉన్నాయి. అంటే అవి ఏమైపోయాయి? ఎక్కడికి తరలించారు? ఎందుకు షిఫ్ట్ చేశారు? దాడి చేయడానికా? అటాక్ జరిగితే నష్టం లేకుండా సేఫ్ ప్లేస్లో దాచారా?
అగ్రరాజ్యం భయపడుతోందా?
మరో రెండు వారాల్లో ఏం చేయాలో నిర్ణయిస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఖతార్ వైమానిక స్థావరంలో నిలిపిన అమెరికా యుద్ధ విమానాలు కన్పించకపోవడం ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇజ్రాయెల్కు మద్ధతిస్తోందని అమెరికాపై ఆగ్రహంతో ఉన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ. ఇలాంటి పరిస్థితుల్లో టెహరాన్ ఏవైనా దాడులు అంటూ చేయడం మొదలు పెడితే అల్ ఉదీద్ ఎయిర్బేస్ మొదటి టార్గెట్ అవుతుందన్న భావనలో ఉంది అమెరికా. అందుకే ముందు జాగ్రత్త చర్యగా అక్కడ్నుంచి తమ యుద్ధ విమానాలను తరలించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే సమయంలో.. పైకి రెండు వారాలు అని చెబుతున్నా.. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల ఎప్పుడు వెలువడినా దాడులు చేసేందుకే ఆయా మిలటరీ జెట్స్ సమీపంలోని స్థావరాలకు వెళ్లి ఉండొచ్చన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
Also Read : ఇరాన్ను ఆ యువతి శాపం వెంటాడుతోందా?
ఆ పని మాత్రం చేయమన్న ఇజ్రాయెల్
మరోవైపు, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ కీలక కామెంట్లు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. ఇరాన్ అణు స్థావరాలను అన్నింటినీ ధ్వంసం చేసే సత్తా తమకు ఉందన్నారు. అయితే.. వీటిపై అటాక్స్ చేసేందుకు తాము మాత్రం అమెరికా ఆదేశాల కోసం వేచి చూడబోమని తేల్చి చెప్పారు. టెహరాన్పై దాడుల్లో భాగంగా ఫోర్డ్లోని భూగర్భ అణు కేంద్రంతోపాటు మిగిలిన ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై అటాక్స్ చేయనున్నట్లు వెల్లడించారు నెతన్యాహు. ఇదే సమయంలో ఇరాన్లో పరిపాలనను ధ్వంసం చేసే ఉద్దేశం తమకు లేదన్నారాయన. తాను మాత్రం ఇజ్రాయెల్కు ఏది మంచిదో అది మాత్రమే చేస్తానన్నారు. ఇదే మాదిరిగా అమెరికా సైతం వాళ్లకు ఏది మంచిదో అదే చేస్తుందని చెప్పుకొచ్చారు.