Congo Massacre: అంతర్యుద్ధంతో ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు వణుకుతున్నాయి. తాజాగా కాంగోలో తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. ఏకంగా 52 మందిని పౌరులను ఊచకోత కోశారు. వెంటాడి మరీ వారిని నరికి నరికి చంపేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఏం జరిగింది?
చీకటి ఖండం ఆఫ్రికా గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఖండంలోని పలుదేశాల్లో అంతర్యుద్ధ జరుగుతూనే ఉంది. అధికారం కోసం తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. కాంగో బలగాల చేతిలో ఓటమి పాలయ్యింది అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్-ఏడీఎఫ్. దీన్ని దృష్టిలో పెట్టుకున్న తిరుగుబాటు దారులు ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేశారు.
ఏకంగా బెని, లుబెరో ప్రాంతాల్లో సామాన్యులపై తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. నిద్రపోతున్న వారిని లేపి తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. ఏకంగా 52 మందిని చంపేశారు. ఈ ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక అధికారి ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. ఆగస్టు 9 నుంచి 16 మధ్య ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఒక్క మెలియా గ్రామంలో దాదాపు 30 మందిని చంపేశారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అంతేకాదు ప్రజలు ఉండటానికి గూడు లేకుండా వాటికి నిప్పుపెట్టారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారుల మాట. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి సమీపంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.
ALSO READ: మార్కెట్ కి వెళ్తుండగా పడవ బోల్తా, 40 మంది గల్లంతు
కాంగో ప్రభుత్వానికి-తిరుగుబాటుదారులకు మధ్య శాంతి ఒప్పందాలు జరుగుతున్నప్పటికీ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తమకు ప్రత్యే దేశం కావాలని తిరుగుబాటు దారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో హింస మొదలైంది. ఆగస్టు 18కి శాశ్వత శాంతి ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రభుత్వం-తిరుగుబాటుదారులు అంగీకరించాయి.
సోమవారం ఎలాంటి ఒప్పందం జరిగినట్టు ప్రకటన రాలేదు. కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని దక్కించుకునేందుకు తిరుగుబాటుదారులు ఏడీఎఫ్ పోరాడుతున్నట్లు తెలుస్తోంది. కాంగో సైన్యం ప్రతినిధి లెఫ్టినెంట్ ఎలోంగో క్యోండ్వా మార్క్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దళాల చేతిలో ఓటమి పాలైన తర్వాత ADF పౌరులపై ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు.
ఉగాండా-డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది ఏడీఎఫ్. పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు తిరుగుబాటుదారులు. 2013 నుంచి ఇప్పటివరకు 6 వేల మందికి చంపినట్టు వివిధ నివేదికలు చెబుతున్నాయి. కొన్నాళ్ల కిందట ఏడీఎఫ్పై అమెరికా-ఐరాస భద్రతామండలిలు ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే.