ఇజ్రాయెల్ దేశం ఇండియాకు క్షమాపణ చెప్పింది. ఇజ్రాయెల్ చేసింది తప్పే, అయితే ఆ తప్పు ఇంకా జనంలోకి రాలేదు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది, భారత ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించలేదు. అంతలోనే ఇజ్రాయెల్ తన తప్పు తెలుసుకుంది, వెంటనే సారీ చెప్పింది. భారత సార్వభౌమత్వాన్ని గుర్తించడమే కాదు, భారత్ తో శత్రుత్వం పెంచుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసినట్టయింది.
అసలింతకీ ఆ తప్పేంటి..?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రెయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ క్షిపణుల పరిధిని వివరించే మ్యాప్ను విడుదల చేసింది. ఇందులో జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్లో భాగంగా చూపించారు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలను నేపాల్లో భాగంగా చిత్రీకరించారు. దీనిపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. భారత్ కి చెందిన పలువురు సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు ఇజ్రాయెల్ తప్పుని గుర్తించి విమర్శలు చేశారు. ఇండియన్ రైట్ వింగ్ కమ్యూనిటీ ఘాటుగా స్పందించింది. భారత్ విదేశాంగ విధానంలో ఎందుకు మధ్యేమార్గాన్ని అవలంబిస్తుందనే విషయం ఇప్పటికైనా అర్థమైందా అని IDFకు సమాధానమిచ్చింది. విదేశాంగ విధానంలో ఎవరూ ఎవరికి మిత్రులు కారు అనే అర్థం వచ్చేలా రిప్లై ఇచ్చింది. దీంతో భారత్ ఈ విషయంలో ఆగ్రహంతో ఉన్నట్టుగా ఇజ్రాయెల్ కి అర్థమైంది. వెంటనే IDF తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది.
This post is an illustration of the region. This map fails to precisely depict borders. We apologize for any offense caused by this image.
— Israel Defense Forces (@IDF) June 13, 2025
మ్యాప్ తో గందరగోళం..
ఇరాన్ తర్వాత ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, భారత్, చైనా.. ఇలా వివిధ దేశాలు ఉన్నట్టుగా IDF ఒక మ్యాప్ విడుదల చేసింది. అయితే ఆ మ్యాప్ లో భారత్ లోని జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లోకి వచ్చేట్టుగా చిత్రీకరించారు. ఇక నేపాల్ తో మన ఈశాన్య రాష్ట్రాలను కలిపేశారు. దీంతో వివాదం చెలరేగగా.. ఆ మ్యాప్ కచ్చితమైన జాతీయ సరిహద్దులను సూచించేది కాదంటూ IDF వివరణ ఇచ్చింది.
ఇరాన్ క్షిపణి పరిధిలో 15 దేశాలు
ఇరాన్ ప్రపంచ ముప్పు అని పేర్కొంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వారి అంతిమ లక్ష్యం కాదని, ఆ తర్వాత ప్రపంచాన్ని కబళించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని చెప్పింది. ఇది ఆరంభం మాత్రమేనని, ఆ తర్వాత ఇతర దేశాలపైకి కూడా దాడులు చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మ్యాప్ ద్వారా వివరించింది. ఇరాన్ ఆయుధాల పరిధిలోకి ఏయే దేశాలు వస్తాయో ఈ మ్యాప్ లో చూపించారు. ఇరాన్ క్షిపణి పరిధిలో భారతదేశం కూడా ఉందని మ్యాప్లో చేర్చారు. ఆ మ్యాప్ ప్రకారం భారత్ సహా 15 దేశాలు ఇరానియన్ క్షిపణుల పరిధిలోకి వస్తాయి. అందుకే ముందుగా తాము ఇరాన్ పై తిరుగుబాటు చేస్తున్నామని, తమతోపాటు ఇరాన్ క్షిపణుల పరిధిలోకి వచ్చే అన్ని దేశాలు అలర్ట్ గా ఉండాలనే సందేశాన్నిచ్చింది ఇజ్రాయెల్ సైన్యం. మొత్తమ్మీద తప్పుడు మ్యాప్ తో మరిన్ని ఇబ్బందులు రాకముందే ఇజ్రాయెల్ తమ తప్పు ఒప్పుకుని సారీ చెప్పడం ఇక్కడ విశేషం.
ఇక ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం విషయానికి వస్తే.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ దాడులు మొదలు పెట్టింది. టెహ్రాన్పై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులలో అనేక మంది ఇరానియన్ సైనిక కమాండర్లు మరణించారు. కీలకమైన స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీనికి ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంది. జెరూసలేం సహా ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ లతో దాడులు చేసింది. క్షిపణులు ప్రయోగించింది. ఈ యుద్ధంతో మరోసారి ప్రపంచం ఉలిక్కిపడింది.