
Israel-Gaza War : గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలపై దాడులు చేస్తున్నారంటూ పాలస్తీనా.. లేదు హమాస్ టార్గెట్లను మాత్రమే టార్గెట్ చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నాయి. అయితే ఇరువురి మధ్య సామాన్యుల బతుకులు నాశనమవుతున్నాయి. గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది.
మరోవైపు ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిలిటెంట్ గ్రూపు హెజ్బొల్లా లీడర్ హసన్ నస్రల్లా.. హమాస్, పాలస్తీనా, ఇస్లామిక్ జిహాద్ నేతలతో భేటీ అయ్యాడు. ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ మొదలయ్యాక వారి మధ్య భేటీ జరగడం ఇదే తొలిసారి. బీరుట్లో జరిగిన ఈ భేటీలో హమాస్ నేత సలేహ్ అల్-అరౌరీ, ఇస్లామిక్ జిహాద్ నేత జియాద్ అల్-నఖ్లే పాల్గొన్నారు. ఇరాన్ మద్దతిచ్చే మిలిటెంట్లతో కలిసి ఉమ్మడిగా పోరాడాలని ఈ భేటీలో నిర్ణయించారు.
ఈ నిర్ణయం కనుక అమలైతే ఇజ్రాయెల్పై ముప్పేట దాడులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే అమెరికాతో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి. దానికి అరబ్ దేశాల రియాక్షన్ ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు కలవరపెడుతోంది. అయితే తమపై దాడులు చేసిన హమాస్ అంతు చూసే వరకు వెనక్కి తగ్గేది లేదని చెబుతోంది ఇజ్రాయెల్.
మరోవైపు గాజాను అన్ని వైపులా దిగ్బంధించడంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంధనం కరువైంది. తమకు ఇంధనం అందకపోతే సహాయక చర్యలను ఆపేస్తామని యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ హెచ్చరించింది. అయితే గాజాలోకి ఫ్యూయెల్ ను అనుమతిస్తే దానిని హమాస్ మిలిటెంట్లు ఎత్తుకుపోతారని ఇజ్రాయెల్ నిరాకరిస్తోంది. హమాస్ ఇప్పటికే 5 లక్షల లీటర్ల ఇంధనాన్ని దాచిపెట్టుకుందని ఇజ్రాయెల్ చెప్తోంది.
హమాస్ రాకెట్ లాంచర్లు, తమ ఆయుధాలను సామాన్య ప్రజల ఇళ్ల మధ్య, స్కూళ్లు, మసీదులు, ఆసుపత్రులు, యూఎన్ కార్యాలయాల సమీపంలో దాచి ఉంచిందని.. వీటిపై తాము ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే అవి కూడా దెబ్బ తీంటున్నాయని.. వీటిని వీడియోలు తీసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇజ్రాయెల్ చెబుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా విడుదల చేసింది.
మరోవైపు పాలస్తీనా ప్రజలు 56 ఏండ్లుగా అణచివేతకు గురవుతున్నారని, హమాస్ దాడులు ఒక్కరోజులో జరిగినవి కావంటూ యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ చేసిన కామెంట్లపై ఇజ్రాయెల్ మండిపడింది. హమాస్ నరమేధాన్ని సమర్థించిన ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. గుటెర్రస్ కామెంట్లకు నిరసనగా యూఎన్ సిబ్బందికి వీసాలను నిలిపేస్తామని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక గాజాలో మానవతా సాయం అందించేందుకు దాడులు ఆపాలని అమెరికా విజ్ఞప్తి చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. అందుకే తమ గ్రౌండ్ అసాల్ట్ ఆలస్యమవుతోందని తెలిపారు. ఇప్పటికే గాజా సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంక్లు, సాయుధ బలగాలను మోహరించి సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్. అయితే దీనిని కౌంటర్ చేసేందుకు హమాస్, హెజ్బుల్లా కూడా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది.