Jimmy Carter – India: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ వందేళ్ళ వయసులో ఇటీవల మరణించారు. ఆయన అంత్యక్రియలను ఈనెల 9వ తారీఖున వాషింగ్టన్ నేషనల్ కేథడ్రాల్ లో నిర్వహించినున్నట్లు అమెరికా ఆర్మీ ప్రకటించింది.
ఈ సందర్భంగా జిమ్మీ కార్టర్ మరణ వార్త విని భారత్ లోని ఓ గ్రామం కన్నీరు పెట్టుకుంది. వేల మైళ్ళ దూరంలోని ఈ గ్రామానికి జిమ్మీ కార్టర్.. ఓ ప్రత్యేక, విశిష్ట అతిథి. ఈ అనుబంధం ఇప్పుడు ఏర్పడింది కాదు.. ఎప్పుడో 1978లో ఏర్పడిన అనుబంధం. అది నేటికీ కొనసాగుతోంది. రానున్న రోజుల్లోనూ, ఆ గ్రామం ఉన్నంతకాలం ఇలాగే కొనసాగుతుంది అంటున్నారు. అందుకే ఆ గ్రామస్తులు జిమ్మీ కార్టర్ మరణ వార్త విని బాధపడ్డారు. వారి ప్రియమైన వ్యక్తి ఇక ఎప్పటికీ కనిపించని దూరాలకు వెళ్లిపోయాడని కన్నీళ్లు రాల్చుతున్నారు. ఇంతకీ ఈ అనుబంధం ఎలా ఏర్పడిందో తెలుసా..? సుదూర తీరాల్లోని భారత్ కు కార్టర్ కి ఉన్న సంబంధం ఏంటి.?
ఆ బంధం కలిసిందిలా
జిమ్మీ కార్టర్ 1977 – 81 మధ్య ఐదేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ సమయంలోనే 1978 జనవరి 03 తారీఖున భారత్ పర్యటనకు వచ్చారు. దిల్లీకి 32 కిలోమీటర్ల దూరంలోని హరియాణాకు చెందిన దౌలత్ పూర్ నశిరాబాద్ అనే గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామాన్ని ఆయన సందర్శకు ఎంచుకోవటానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. అదేంటంటే.. కార్టర్ తల్లి లిలియన్ పీస్ కోర్ లో భాగస్వామిగా ఆ గ్రామంలో 1960లో నర్సుగా సేవ చేశారు. అలా.. ఆ ఊరితో పరోక్షంగా అనుబంధం కలిగిన జిమ్మీ కార్టర్.. తన భార్య రోసాలిన్ తో కలిసి దౌలత్ పూర్ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులతో కలివిడిగా కలిసిపోయి ఆనందంగా గడిపారు.
ఆరోజు తమకి ఇప్పటికే గుర్తుంది అంటున్నారు గ్రామస్తులు. అమెరికా అధ్యక్షుడి హోదాలో జిమ్మీ కార్టర్ వస్తున్న విషయం తెలియగానే.. నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయనకు ఏ విధంగా స్వాగతం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలందరూ కూర్చుని అనేకసార్లు చర్చించినట్లు ఇప్పటి తరం పిల్లలకు చెబుతున్నారు. వారు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. జనవరి 3 తేదీ 1978లో అగ్రరాజ్యాధిపతి దౌలత్ పూర్ గ్రామానికి విచ్చేశాడు. ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ ఆ గ్రామం మొత్తం కలియతిరిగాడు. వారందరితో కలిసి ఆ గ్రామ సంప్రదాయం నృత్యాలను చేశాడు. తాను దేశాధ్యక్షుడిని అన్న సంగతి పక్కనపెట్టి గ్రామస్తులతో గ్రామస్తుడిగా కలిసిపోయి ఉత్సాహంగా గడిపారు.
భార్యను చూస్తూ.. మురిసిపోయారు
దౌలత్ పూర్ గ్రామస్తులు కూడా జిమ్మీ కార్టర్ ను ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆయన భార్య రోసాలిన్ ను సంప్రదాయ దుస్తులతో అలంకరించారు. చేతుల్లో చేతులు కలిపి నృత్యాలు చేశారు. తన భార్య గ్రామస్తులతో కలిసి సంప్రదాయ వస్త్రాలంకరణలో డాన్సులు చేయడం చూస్తూ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. తన భార్యను చూసి మురిసిపోయారు. అప్పటి ఫోటోలు ఇప్పటికీ చాలా ఫేమస్.. లేక్కలేనన్ని ముఖ్యమైన పనుల భారంతో ఉండే అమెరికా అధ్యక్షుడు అలా ఆనందంగా గడపడం ఇప్పటికీ ఆ గ్రామస్తుల గుండెల్లో అలాగే నిలిచిపోయింది. ఆయన చూపించిన ప్రేమ, గ్రామంపై అభిమానానికి గ్రామస్తులంతా ఎంతో సంతోషించారు.
అలా ఆ గ్రామంతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్న జిమ్మీ కార్టర్ గ్రామస్తుల మదిని గెలుచుకున్నారు. గ్రామస్తులు సైతం ఆయన ప్రేమాభిమానాలు శాశ్వతంగా గుర్తుండిపోవాలని కోరుకున్నారు. అందుకే.. వారి గ్రామానికి ”కార్టర్ పురి” ‘విలేజ్ ఆఫ్ కార్టర్’ గా మార్చుకున్నారు. ఇప్పటికీ అక్కడ యువతరానికి ఆనాటి ఘటనలు చెబుతూ, కార్టర్ గ్రామాన్ని సందర్శించిన నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ పెద్దవారు మురిసిపోతూ ఉంటారు. అలా తరతరాలుగా కార్టర్ తో ఉన్న అభిమానాన్ని, అనుబంధాన్ని ఆ గ్రామం కొనసాగిస్తూనే వస్తోంది.
విషాదంలో మునిగిపోయిన గ్రామం
జిమ్మీ కార్టర్ మరణ వార్త విన్న తర్వాత ఈ గ్రామస్తులు విచారణ వ్యక్తం చేశారు. ఆయన గౌరవార్థం.. ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జిమ్మీ కార్టర్ వారి ఊరికి వచ్చినప్పుడు తీసుకున్న చిత్రాన్ని ఉంచి పుష్పగుచ్చాలు అర్పించి, నివాళులు అర్పించారు. జిమ్మీ కార్టర్ మరణ వార్తను తెలుపుతూ భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి విడుదల చేసిన సందేశంలోనూ ఈ గ్రామం పేరు ప్రస్తావించారు. జిమ్మీ కార్టర్ భారత్ పై ఉంచిన గొప్ప గౌరవానికి ఈ గ్రామం ఓ నిదర్శనం అంటూ తెలిపారు.
Also Read : పక్షులు విమానాన్ని కూల్చేస్తాయా? అదెలా సాధ్యం.. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటీ?
కాగా ఈ గ్రామస్తుల ప్రేమకు మురిసిపోయిన జిమ్మీ కార్టర్ తన పర్యటనను అడుగడుగునా ఆనందంగా మార్చిన గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ.. వ్యక్తిగతంగా తనకు ఆ పర్యటన ఎంతో సంతోషాన్ని మిగిల్చిందని ఆనందం వ్యక్తం చేశారు. తన సంతోషాన్ని తలుపుతూ.. ఓ లేఖను, ఫోటోగ్రాఫ్ ను గ్రామానికి పంపించారు. ఇప్పుడు ఆ గ్రామానికున్న విలువైన ఆస్తుల్లో ఆనాడు జిమ్మీ కార్టర్ పంపిన లేఖ, ఫోటో ఎంతో ముఖ్యమైనవని ఆ గ్రామస్తులు చెప్తున్నారు.