USCIRF India Minorities Persecution| భారతదేశంలో మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయని అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. అయితే ఈ నివేదికపై భారత్ తీవ్రంగా స్పందించింది. అమెరికా ప్యానెల్ రిపోర్ట్ పక్షపాతంతో, రాజకీయంగా ప్రేరపించబడేలా ఉందని భారత ప్రభుత్వం అభివర్ణించింది.
ఈ నివేదికలోని అంశాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Ranadeer Jaiswal) తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యూఎస్సీఐఆర్ఎఫ్ విడుదల చేసిన నివేదిక.. మత స్వేచ్ఛపై ఆందోళన కలిగిస్తున్నట్లుగా కనిపించడం లేదని, దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను మాత్రమే తప్పుగా చిత్రీకరిస్తూ.. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించేలీ ఉందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యానికి చిహ్నంగా ఉన్న భారత్ ఖ్యాతిని దెబ్బతీసేందుకు అమెరికా సంస్థ పూనుకుంటున్నట్లుగా అనిపిస్తోందని.. అయితే ఇటువంటి ప్రయత్నాలు విజయవంతం కాబోవని చెప్పారు.
Also Read: అమెరికా వద్దు బాబోయ్.. అగ్రరాజ్యాన్ని వీడుతున్న శాస్త్రవేత్తలు
‘‘భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వారు వివిధ మతాలను అనుసరిస్తున్నారు. దేశంలో వివిధ మతాలు, కులాలు, వర్గాలు, సంస్కృతుల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారు. ఈ విషయాన్ని యూఎస్సీఐఆర్ఎఫ్ ఎప్పుడూ గుర్తించలేదు. నిరంతరం దేశంపై తప్పుడు ఆరోపణలే చేస్తోంది’’ అని ఆయన దుయ్యబట్టారు.
యూఎస్సీఐఆర్ఎఫ్ విడుదల చేసిన రిపోర్టులో ఏముంది?
అంతర్జాతీయంగా మత స్వేచ్ఛపై పని చేసే యూఎస్సీఐఆర్ఎఫ్ 2025కు సంబంధించిన వార్షిక నివేదికను తాజాగా విడుదల చేసింది. తన రిపోర్టులో భాగంగా భారత్ను ఓ ఆందోళనకరమైన దేశంగా ప్రకటించాలని అమెరికా ప్రభుత్వానికి సూచించింది. నివేదికలోని వివరాల ప్రకారం.. భారత్లో మత స్వేచ్ఛ క్షిణిస్తోందని, మతపరమైన మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని, వివక్ష పెరుగుతోందని పేర్కొంది. 2024లో లోక్సభ ఎన్నికల వేళ ఈ సంఘటనలు మరింత ఎక్కువయ్యాయని, ఎన్నికల ప్రచార సమయంలో ముస్లింలు, ఇతర మతపరమైన మైనారిటీలపై బీజేపీ ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిందని నివేదించింది.
భారత నిఘా సంస్థ ‘రా’పై ఆంక్షలు విధించాలి..
భారత్కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. ‘రా’పై ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి యూఎస్సీఐఆర్ఎఫ్ సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు భారత నిఘా సంస్థ కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది.
అయితే.. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను, సూచనలను ట్రంప్ కార్యవర్గం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనేమీ లేదు. వియత్నాంలోని కమ్యూనిస్ట్ పాలకులపై కూడా ఈ నివేదికలో విమర్శలు ఉన్నాయి. మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని ఈ నివేదిక పేర్కొంది. ఆ దేశాన్ని ఆందోళనకర జాబితాలో చేర్చాలని సూచించింది.
చైనా కట్టడికి భారత్తో పనిచేసే అమెరికా
చైనాను కట్టడి చేయడానికి అమెరికా, భారత్, వియత్నాం కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా,.. చైనాను కట్టడి చేయడానికి భారత్ ఓ బలమైన శక్తిగా ఉపయోగపడుతుందని అమెరికా భావిస్తోంది. ఈ నేపథ్యం లో.. ట్రంప్ కార్యవర్గం భారత నిఘా సంస్థ ‘రా’పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతన్నారు.
2023లో, అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను హత్య చేసేందుకు భారత్ కుట్ర చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంలో.. మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్పై అమెరికా ఆరోపణలు మోపింది. ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు ఆ ఆరోపణలో పేర్కొంది. మరోవైపు, అమెరికాలో ఉంటూనే పన్నూ భారత ప్రభుత్వానికి బెదిరింపు సందేశాలను విడుదల చేస్తుండటం విశేషం.