Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం భద్రతా సంస్థలు జరిపిన దర్యాప్తులో ఒక ప్రధాన విషయం వెల్లడైంది. ఈ దాడికి ప్రధాన సూత్రదారిని ఏజెన్సీ గుర్తించింది. పాకిస్తాన్ మాజీ SSG కమాండర్ హషీం ముసా 26 మంది హత్యకు కారణం అని తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ముసా లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.
రక్షణ వర్గాల సమాచారం ప్రకారం.. భద్రతా దళాలు, కాశ్మీరీయేతరులపై దాడులు చేయడానికి హషీం మూసాను జమ్మూ కాశ్మీర్కు పంపారు. అక్టోబర్ 2024లో మొదటగా ముసా గండేర్బల్లోని గగాంగిర్లో దాడి చేశాడు. ఈ దాడిలో అనేక మంది కార్మికులు , ఒక స్థానిక డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా దాడిని కూడా మూసా నిర్వహించాడు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ సైనికులు, ఇద్దరు పోర్టర్లు ప్రాణాలు కోల్పోయారు.
హషీం మూసాను జమ్మూ కాశ్మీర్కు పంపించే ముందు పాకిస్తాన్ స్పేస్ సర్వీస్ గ్రూప్ (SSG) అతడికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన్నట్లు దర్యాప్తులో తేలింది. అంతే కాకుండా భారతీయ, విదేశీ పర్యాటకులతో పాటు భద్రతా సిబ్బందితో సహా స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేసే పనిని మూసాకు అప్పగించారని దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
మూసా నేతృత్వంలో మంగళవారం ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మందిని చంపారు. దాడి జరిగిన 24 గంటల తర్వాత బుధవారం ఏప్రిల్ 23న ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ముసా ఫొటో కూడా ఉంది.
ఈ ముగ్గురు అనుమానితులను పాకిస్తాన్కు చెందిన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్ , అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ , అనంతనాగ్ జిల్లాకు చెందిన ఆదిల్ హుస్సేన్ థోకర్గా అధికారులు గుర్తించారు. వీరి సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును కూడా ప్రకటించారు.
NIA ఒక కాశ్మీరీ యువకుడిని కూడా విచారిస్తోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి సంబంధించిన రెండు కొత్త వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో జిప్లైన్ నిర్వహిస్తున్న కాశ్మీరీ వ్యక్తిని ముజమ్మిల్గా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే NIA ముజమ్మిల్ విచారిస్తోంది.
Also Read: సింధు జలాల ఇష్యూ.. మోదీ ప్లాన్ అదిరిపోయిందిగా ? ఇక పాక్కి చుక్కలే !
ఇదిలా ఉంటే పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థ ఈ దాడిలో పాల్గొన్నట్లు వెల్లడైన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి మరింత దిగజారింది. పుల్వామా సంఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.
ఈ హింసకు ప్రతిస్పందనగా.. ఇండియా పాకిస్తాన్పై వరుస కఠినమైన చర్యలను అమలు చేసింది. వీటిలో పాకిస్తాన్ సైనిక అటాచ్లను బహిష్కరించడం, దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం , అట్టారి భూ-రవాణా పోస్టును మూసివేయడం వంటివి ఉన్నాయి. మోదీ నేతృత్వంలోని భద్రతపై క్యాబినెట్ కమిటీ సమావేశం తరువాత ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఉగ్రవాదులందరినీ, వారికి మద్దతు ఇచ్చే వారిని “గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తామని”వెల్లడించారు.