Pakistan China Navy Drills| పాకిస్తాన్ (Pakistan) నిర్వహిస్తున్న అమన్-2025 యుద్ధ విన్యాసాల్లో చైనా (China) కూడా తాజాగా భాగస్వామ్యమైంది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న సమయంలో ఈ పరిణామాలు భారతదేశానికి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి 12 వరకు జరిగిన ఈ విన్యాసాల్లో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. వీటిలో అమెరికా, జపాన్, ఇటలీ, మలేషియా, చైనా వంటి దేశాలు ఉన్నాయి.
ఈ విన్యాసాల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీకి చెందిన గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్, హెలికాప్టర్, మెరైన్ దళాలు పాల్గొన్నాయి. చైనా సీనియర్ మిలిటరీ అధికారులు కూడా ఈ విన్యాసాల్లో హాజరయ్యారు. హిందూ మహాసముద్రంలో యాంటీ పైరసీ (సముద్ర బందిపోట్లను ఎదుర్కొనేందుకు) ఆపరేషన్లు నిర్వహించడం.. సముద్ర మార్గాలను రక్షించడం ఈ విన్యాసాల ముఖ్య ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు.
Also Read: ట్రంప్ క్రిమినల్ మైండ్.. నేరస్తులను భయంకరమైన జైలులో పెట్టాలని ప్లాన్
ఇటీవలే చైనా మత్స్య పరిశోధన పేరుతో రెండు భారీ నౌకలను అరేబియా సముద్రంలోకి ప్రవేశింపజేసింది. వీటిని లాన్హై 101, లాన్హై 201గా గుర్తించారు. ఓపెన్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు. ఈ నౌకలు మారిటైమ్ ఇంటెలిజెన్స్ సేకరణ కోసమే పంపినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. చైనా ఈ నౌకలను మాల్దీవుల్లోని చైనా అనుకూల ప్రభుత్వ అనుమతితో పంపించినట్లు తెలుస్తోంది. లాన్ హై 101 నౌకలో అండర్వాటర్ డ్రోన్లు, రిమోట్ వెస్సల్స్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వీటి ద్వారా సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు.
భారత్ సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు
ఇటీవలే చైనా టిబెట్లో అత్యంత ఎత్తైన ప్రదేశంలో సైనిక విన్యాసాలను ప్రారంభించింది. కఠిన భౌగోళిక పరిస్ధితుల్లో యుద్ధ సన్నద్ధత, లాజిస్టిక్స్ సరఫరాపై కేంద్రీకరిస్తూ పీఎల్ఏ ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేకి ముందే ఈ విన్యాసాలు మొదలవడం వ్యూహాత్మక చర్యగా కనిపిస్తోంది.
ఈ విన్యాసాలను షింజియాంగ్ మిలిటరీ కమాండ్కు చెందిన రెజిమెంట్ నిర్వహిస్తోంది. ఇందులో అత్యాధునిక సైనిక టెక్నాలజీ, ఆల్ టెర్రైన్ వెహికల్స్, డ్రోన్లు, అన్మ్యాన్డ్ సిస్టమ్స్, ఎక్సో స్కెలిటెన్స్ వంటివి వినియోగిస్తున్నారు. చైనా చేపట్టిన తాజా లాజిస్టిక్స్ సపోర్ట్ విన్యాసాలు వ్యూహాత్మకంగా ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో యుద్ధ సమయంలో దళాలకు పరికరాలు, ఆహారం వేగంగా సరఫరా చేయడం వీటిలో ప్రధాన భాగం.
ఈ విన్యాసాలు లద్ధాఖ్కు సమీపంలో జరుగుతున్నాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చైనా దళాలు ఎక్సో స్కెలిటెన్స్ ఉపయోగించడం గమనార్హం.
2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనిక ఘర్షణ తర్వాత ఈ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతకు గురైంది. సైనిక, దౌత్య స్థాయిల్లో జరిగిన చర్చల ద్వారా పరిస్థితిని కొంతవరకు సమతుల్యం చేశారు. గత ఏడాది అక్టోబర్లో బలగాలను వెనక్కి తీసుకోవడానికి కీలక ఒప్పందం జరిగింది.
భారత సైన్యం కూడా హిమాలయాల్లో పోరాట నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ప్రతీ ఏడాది హిమ్ విజయ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో సైనికుల సమన్వయాన్ని మెరుగుపర్చేలా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. చైనా దళాల కదలికలను గుర్తించేందుకు అధునాతన నిఘా వ్యవస్థలు, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్లు ఉపయోగిస్తోంది. అంతేకాదు, సరిహద్దుల్లో కీలకమైన రహదారులు, వంతెనలు, సొరంగాల నిర్మాణాన్ని వేగవంతం చేసి, దళాల కదలిక మరింత సులభతరం చేసింది.