Babri Masjid Pakistan MP| పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ సైన్యంలో సుమారు 5,000 మంది సైనికులు భయంతో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ, రాజకీయ నాయకులు మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మంగళవారం పాకిస్తాన్ ఎగువ సభలో ఆ దేశ సెనెటర్ పల్వాషా మొహమ్మద్ జై ఖాన్ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాకిస్తాన్ సైనికులే పునాది వేస్తారని ఆమె రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారు. తాము గాజులు తొడుక్కుని నిశ్చింతగా కూర్చోలేదని .. ఈ నిర్మాణం కోసం మొదటి ఇటుకను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా వేస్తారని, ఆమె అన్నారు. అంతేకాకుండా.. భారత సైన్యంలోని సిక్కు సైనికులు భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే పాకిస్థాన్పై దాడి చేయరని ఆమె నొక్కి చెప్పారు. ఎందుకంటే, పాకిస్తాన్ అనేది సిక్కులకు గురునానక్కు సంబంధించిన పవిత్ర భూమి అని ఆమె పేర్కొన్నారు. పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Also Read: పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదం.. క్రికెట్ అభిమానిపై మూకదాడి చేసి హత్య
ఆమె ఈ వ్యాఖ్యలు భారత్లో మతాల మధ్య విభేదాలను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే చేశారని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబ్రీ మసీదు అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం, సిక్కు సముదాయాన్ని తమవైపు ఆకర్షించేలా మాట్లాడటం దీనికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. పహల్గామ్ ఘటన తర్వాత భారత్ తీవ్ర చర్యలు చేపట్టినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఎవరో ఒక పాకిస్తాన్ నాయకుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే, భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాదులను అంతమొందించి తీరుతామని స్పష్టం చేస్తూ, తన సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చింది. దీంతో, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారింది.
సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. భారత్ను నేరుగా ఎదుర్కోలేని పాకిస్తాన్ ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడుతోంది. చివరకు భారత సైన్యం గురించి కూడా అసత్య వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అసలు వాస్తవాలను వెల్లడించి, ఈ తప్పుడు ప్రచారానికి కౌంటర్ ఇచ్చింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత నార్తర్న్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్ను పదవి నుంచి తొలగించారని, ఆయనను కస్టడీలోకి తీసుకున్నారని పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో పలు పోస్టులు వెలువడ్డాయి. భద్రతా వైఫల్యం కారణంగా ఈ చర్యలు తీసుకున్నారని ఆ పోస్టుల సారాంశం. అయితే, ఈ వార్తలన్నీ నకిలీవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పష్టం చేసింది. సుచీంద్ర కుమార్ గురించి పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాయని పీఐబీ వెల్లడించింది.
వాస్తవానికి సుచీంద్ర కుమార్ ఏప్రిల్ 30, 2025న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది. అలాగే, బార్డర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాకిస్తాన్ సైన్యం.. భారత దేశానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిందని మరో తప్పుడు వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ వార్త కూడా అసత్యమని భారత్ స్పష్టం చేసింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్థాన్కు చెందిన అనేక యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని తెలిసి, భారత్ వాటిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఒకవైపు ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలను పరిశీలించిన పీటీఐ వార్తా సంస్థ ఫ్యాక్ట్ చెక్ విభాగం, వాటిలో చాలా వీడియోలు నకిలీవని నిర్ధారించింది. ఏప్రిల్ 22, 2025న పహల్గామ్ ఉగ్రవాదులు చేసిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్తో దౌత్య సంబంధాలకు గురించి కీలక నిర్ణయాలు తీసుకుంది.