Pakistan: పాకిస్తాన్ వైఖరిలో మార్పు కనిపిస్తుందా? ఎందుకు ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీష్ అలా అన్నారు? భారత్పై గెలవాలనే ఆశ, ఆకాంక్ష దాయాది దేశానికి తగ్గలేదా? మూడు యుద్ధాలు చేసినా, ఏమీ సాధించలేదని ఎందుకన్నారు? ఓ వైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు కాశ్మీర్ సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేస్తోందా? అవుననే అంటున్నారు చాలా మంది నిపుణులు.
ఆదేశ సైనికులకు కృతజ్ఞతలు చెప్పేందుకు యోమ్-ఏ-తశక్కర్ ముగింపు కార్యక్రమం జరిగింది. శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఇప్పటివరకు మూడు యుద్ధాలు జరిగాయన్నారు. అందులో ఏమీ సాధించలేక పోయాయమని మనసులోని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా కూర్చొని చర్చించుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారించుకోవచ్చని అన్నారు. కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు ఆయన. భారత్-పాకిస్తాన్లు చర్చలకు కూర్చొని జమ్మూ-కాశ్మీర్ సహా అన్ని అపరిష్కృత అంశాలను పరిష్కరించుకోవాలని ప్రతిపాదించారు ప్రధాని షెహబాజ్ షరీఫ్.
ముందు శాంతి నెలకొంటే అప్పుడు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సహకరించు కోవచ్చన్నారు. పైగా పాకిస్తాన్ శాంతి కాముక దేశమైనా స్వీయ రక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందన్నారు. ఇటీవల జరిగిన సైనిక ఘర్షణను ఈ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు.
ALSO READ: CODE 8647 ఈ కోడ్ కి అంత అర్థం ఉందా?
భారత్కు దీటుగా జవాబిచ్చే పాకిస్తాన్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని సైనికులపై ప్రశంసల జల్లు కురిపించారు పీఎం షెహబాజ్. భారత్-పాకిస్థాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుకుందామని ఆదేశ విదేశాంగమంత్రి ఉప ప్రధాని ఇశాక్ డార్ మాట.
పాకిస్థాన్ చర్చలంటూ ఉంటే అది కేవలం పాక ఆక్రమిత కాశ్మీర్పైనే ఉంటుందని ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పదే పదే తెగేసి చెప్పేసింది. అయినా దాయాది దేశం మాత్రం పీఓకే వ్యవహారంపై కనీసం నోరు మెదపలేదు. కేవలం కాశ్మీర్ అంటూ పదే పదే ఆ విషయాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దాయాది దేశం వైఖరి గమనిస్తే శాంతి చర్చలకు ఏ మాత్రం సుముఖంగా లేమని చెప్పకనే చెబుతోంది.
పాక్ శాంతి చర్చలంటూ కొత్త పల్లవిని ఎత్తుకోవడంతో శుక్రవారం భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రియాక్ట్ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. దాయాది దేశం తమ తీరు మార్చుకోకుంటే అసలు సినిమా చూపిస్తామని అన్నారు. శుక్రవారం భుజ్ ఎయిర్బేస్కు చేరుకుని సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ శాంతికి భంగం కలిగించే వారిని ఏ మాత్రం వదిలిపెట్టబోమన్నారు.
జమ్మూకాశ్మీర్లో ఏప్రిల్ 22న పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు ముష్కరులు. దీనికి ప్రతిస్పందనగా మే ఏడున పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాదుల స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది భారత్ సైన్యం. కీలకమైన తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెల్సిందే.