Israel Defense Minister| ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గాజాలో గత 13 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం పరిణామాలు సంతృప్తికరంగా లేవని కారణాలు చూపుతూ దేశ రక్షణ మంత్రి యోఆవ్ గల్లంత్ ని పదవి నుంచి తొలగించారు. యుద్ధ పరిణామాలు, అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ పై జరిగిన హమాస్ దాడి వల్ల యోఆవ్ గల్లంత్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండడంతో తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రధాని నెతన్యాహు తెలిపారు.
ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రిగా విదేశాంగ మంత్రిగా ఉన్న ‘ఇజ్రాయెల్ కట్జ్’ ను నియమించారు. రక్షణ మంత్రి యోఆవ్ గల్లంత్ ఆదేశాలతోనే లెబనాన్, గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. హమాస్ మిలిటెంట్లు అయినా, హిజ్బుల్లా మిలిటెంట్లు అయినా వారిని మట్టుబెట్టడానికి అడ్డుగా ఉన్న మహిళలు, పిల్లలు, వృద్ధులు అని తేడా లేకుండా పౌరలందరినీ ఇజ్రాయెల్ సైనికులు హతమారుస్తున్నారు. పైగా యుద్ధం కారణంగా ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ వారికి సాయం చేస్తున్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యకర్తల ప్రాణాలు సైతం ఇజ్రాయెల్ సైనికులు బలిగొన్నారు. ఈ రెండు యుద్ధాలలో ఇప్పటివరకు 200 మందికి పైగా మానవ హక్కుల కార్యకర్తలు చనిపోయారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని మండిపడుతున్నాయి.
Also Read: అమెరికా ఎన్నికల కౌంటింగ్.. దూసుకెళుతున్న ట్రంప్
ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి పదవి నుంచి యోఆవ్ గల్లంత్ ను తొలగించడం.. అదే సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడంతో ప్రధాని నెతన్యాహు ఈ నిర్ణయం రాజకీయ లబ్ధి కోసమే తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం.
2023 అక్టోబర్ లో జరిగిన హమాస్ దాడిలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. దీంతో అప్పటివరకు అబేధ్యమైన ఇజ్రాయెల్ రక్షణ కవచాన్ని హమాస్ ఛేదించినట్లు అయింది. హమాస్ ఇంత పెద్ద దాడి చేయడంతో రక్షణ మంత్రి వైఫల్యమే దీనికి కారణమని అప్పట్లో ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. ఆ తరువాత యోఆవ్ గల్లంత్ కూడా ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యలు అనాలోచితమని.. యుద్ధం జరుగుతున్న తరుణంలో సైనికుల మనోబలం దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడుతున్నారని ఎదురు దాడి చేశారు. దీంతో ఇద్దరి మధ్య మనస్ఫర్తలు ఉన్నట్లు బయటపడింది.
ఇటీవల 2023 అక్టోబర్ దాడుల సూత్రధారి హమాస్ నాయకుడు యాహ్య సిన్వర్ మరణించడంతో ఇక యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కతార్, ఈజిప్ట్ దేశాల్లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య సంధి చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు హిజ్బుల్లా కొత్త నాయకుడు నయీం ఖాసెమ్ కూడా తాము సంధికి రెడీ వ్యాఖ్యలు చేశారు. దీంతో రక్షణ మంత్రి యోఆవ్ గల్లంత్ పై చర్యలు తీసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధానికి ఇదే అనుకూల సమయంగా కనిపించింది. ఇజ్రాయెల్ ప్రజలు కూడా హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ కుటుంబ సభ్యులను నెతన్యాహు ప్రభుత్వం ఎందుకు విడిపించుకొని తీసుకురావడం లేదని నిలదీస్తున్నారు. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరసనలు జరుగుతున్నాయి.
ఈ సమస్య నుంచి బయటపడడానికే ప్రధాని నెతన్యాహు యుద్ధంలో వైఫల్యాలకు రక్షణ మంత్రి యోఆవ్ గల్లంత్ కు బలి చేసినట్లు కనిపిస్తోంది.