Biden Diwali Celebrations| దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో కూడా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడన్ కూడా దీపావళి వేడుకలు సోమవారం అక్టోబర్ 28, 2024 సాయంత్రం వైట్ హౌస్ లో జరుపుకోనున్నారు.
ఈ వేడుకలను అమెరికాలోని ప్రముఖ ఇండియన్ అమెరికన్స్ కు జోబైడెన్ ఆహ్వానం పలికారు. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనుండడంతో ఇవే బైడెన్ చివరి దీపావళి వేడుకలు కావడం విశేషం. ఆయన ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తరువాత నుంచి దీపావళి వేడుకలు జరుపుకుంటూనే ఉన్నారు.
Also Read: న్యూయార్క్లో అట్టహాసంగా ట్రంప్ ఎన్నికల ప్రచారం.. వేలమంది జనం, సెలబ్రిటీలు, భార్యతో డాన్స్..
వైట్ హౌస్లోని బ్లూ రూమ్లో జో బైడెన్ తన సతీమణి అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ తో కలిసి ఒక దీపం వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ వేడుకల జరుపుకోవడానికి భారతీయులకు బైడెన్ ఈసారి ఒక రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. దీంతో పాటు అంతరిక్షంలో ఉన్న హిందూ వ్యోమగామి సునీతా విలియమ్స్ వీడియో కూడా ప్లే చేయనున్నారని సమాచారం. భారత మూలాలున్న ఆస్ట్రానట్ సునీతా విలియమ్స్ హిందూ మతాన్ని పాటిస్తారు. గత కొన్ని నెలలుగా ఆమె అంతరిక్షంలోనే చిక్కుకొని ఉన్నారు. ఆమె భూమి నుంచి బయలుదేరిన స్పేస్ షిప్ లో టెక్నికల్ సమస్యలు రావడంతో సునీతా గత కొన్ని నెలలుగా అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లోనే చిక్కుకొని ఉన్నారు.
అయితే దీపావళి సందర్భంగా అమెరికా పౌరసత్వం ఉన్న సునీతా విలియమ్స్ సాటి హిందువులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఒక వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోని వైట్ హౌస్ లో దీపావళి వేడుకల సందర్భంగా ప్లే చేయనున్నారు. ఆమె అంతరిక్షంలో తనతోపాటు భగవద్గీత, ఉపనిషద్ గ్రంథాలు తీసుకెళ్లి అక్కడ చదువుతూ ఉంటుందని ఈ వీడియోలో పేర్కొనడం విశేషం.
మరోవైపు వైట్ హౌస్ దీపావళి వేడుకల్లో నూతన అనే క్లాసికల్ సౌత్ ఇండియన్ డాన్స్ ప్రదర్శన, సంగీత కార్యక్రమాలతో పాటు అమెరికా మెరైన్ కార్ప్ బ్యాండ్ కూడా ప్రదర్శన ఇవ్వబోతోందని వైట్ హౌస్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
గత సంవత్సరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలు జరుపుకుంటూ ట్విట్టర్ ఎక్స్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో దీపావళి పండుగ జ్ఞానం, ప్రేమ, ఐకమత్యం పెంపొదిస్తుందని.. ద్వేషం, విభజన అనే అంధకారానికి వ్యతిరేకమని ఆయన గొప్పగా సందేశమిచ్చారు.
లండన్ నగరంలో కూడా నగర మేయర్ సాదిఖ్ ఖాన్ ఆ దేశ హిందువులతో కలిసి ఆదివారం ట్రాఫల్గర్ స్క్వేర్ లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. పాకిస్తానీ మూలాలున్న సాదిఖ్ ఖాన్ ముస్లిం మతాన్ని ఆచరిస్తారు. దీపావళి సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షులు తెలియజేస్తూ.. ఒక ట్వీట్ కూడా చేశారు.