Prisoners Escape Earthquake| భూకంపం లాంటి ప్రకృతి ప్రకోపాలు సాధారణంగా విధ్వంసం, భయాన్ని తెస్తాయి. కానీ కొందరికి మాత్రం ఇది ఒక అవకాశంగా మారింది. పాకిస్థాన్లోని కరాచీలో వచ్చిన భూకంపం ఊహించని రీతిలో ఖైదీలకు అవకాశంగా మారింది. ఈ భూకంపం కరాచీలోని మలీర్ జైలులో తీవ్రమైన భద్రతా సమస్యను సృష్టించింది. ఖైదీలు భూకంపం రావడంతో అవకాశంగా తీసుకొని భద్రతా సిబ్బందిపై దాడి చేసి పారిపోయారు. ఈ సంఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది.
జైలు అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. భూకంపం కారణంగా మలీర్ జైలు గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీన్ని అవకాశంగా ఉపయోగించుకుని, పలువురు ఖైదీలు తప్పించుకున్నారు. కరాచీ డీఐజీ ముహమ్మద్ హసన్ సెహ్తో మీడియాతో మాట్లాడుతూ.. భూకంపం తర్వాత చాలా మంది ఖైదీలు తమ సెల్స్ నుంచి బయటకు వచ్చారని, జైలు గేటును బద్దలు కొట్టి, గార్డులపై దాడి చేశారని తెలిపారు.
కొందరు ఖైదీలు జైలు సిబ్బంది నుండి ఆయుధాలను కూడా లాక్కున్నట్లు సమాచారం. దీంతో తప్పించుకునే ఖైదీలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. జైలు సూపరింటెండెంట్ అర్షద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ కాల్పుల్లో ఒక ఖైదీకి గాయాలయ్యాయని చెప్పారు.
గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు
తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గాజీ టౌన్, షా లతీఫ్, భైన్స్ కాలనీ వంటి సమీప ప్రాంతాల్లో తాత్కాలిక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తప్పించుకున్న ఖైదీలలో ఇప్పటివరకు 20 మందికి పైగా పట్టుకుని తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో నివారించేందుకు, జైలు వెలుపల రేంజర్స్ను మోహరించారు. సమీప ప్రాంతాల్లో మిగిలిన ఖైదీల కోసం గాలింపు కొనసాగుతోంది.
కరాచీలో వరుస భూకంపాలు
గత కొన్ని రోజులుగా కరాచీ నగరంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. ఒక్క రోజులోనే పది సార్లు భూకంపం వచ్చినట్లు పాక్ మీడియా తెలిపింది. తాజాగా జరిగిన జైలు బ్రేక్ ఘటన.. 24 గంటల్లో కరాచీలో వచ్చిన 10వ భూకంపం తర్వాత జరిగింది. తాజా భూకంపం 2.4 తీవ్రతతో రాత్రి 11:16 గంటల సమయంలో లాండీ, షెర్పావ్, క్వాయిదాబాద్ ప్రాంతాల్లో సంభవించింది.
వాతావరణ శాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. కిర్తార్ ఫాల్ట్ లైన్ సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో చిన్న భూకంపాలు సాధారణం. అయితే, జైలుపై ఈ భూకంపాల ప్రభావం.. సహజ విపత్తుల సమయంలో ఇలాంటి భవనాల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది.
Also Read: అర్ధరాత్రి కలకలం.. రైతు ఇంట్లో 100 పాములు.. గ్రామస్తులు ఎంత తప్పు చేశారంటే?
జైలు శాఖ మంత్రి సీరియస్
సింధ్ జైలు శాఖ మంత్రి అలీ హసన్ జర్దారీ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)లను ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఖైదీలు సుదూర ప్రాంతాలకు పారిపోకుండా నిరోధించేందుకు పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని మంత్రి ఆదేశించారు. పారిపోయిన ప్రతి ఖైదీని పట్టుకోవాలని, అలసత్వం చేసిన జైలు సిబ్బందిపై విచారణ జరపాలని ఆదేశించారు.