Kalvakuntla Kavitha: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముందు కాంగ్రెస్ సర్కారు మోకరిల్లిందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి ఉచిత కరెంట్ ను ఎత్తివేసే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసిన కవిత.. అనంతరం పీపుల్స్ ప్లాజాలో టీజీఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసిన పవర్ ఎక్స్ పో – 2026ను సందర్శించారు. అక్కడ ప్రదర్శనకు ఉంచిన స్మార్ట్ మీటర్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత కరెంట్ ను దూరం చేయడంతో పాటు లాండ్రీ షాపులు, సెలూన్లకు ఉచిత కరెంట్ ఎత్తివేసే కుట్రలో భాగంగానే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకంలో భాగంగానే రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. గతంలో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం రేవంత్ సర్కారు చేసిందన్నారు. అదానీకి లాభం చేయడానికి కేంద్రం స్మార్ట్ మీటర్లు ప్రవేశ పెడుతుంటే రేవంత్ సర్కారు దానికి వంత పాడుతోందన్నారు. దీనిపై ప్రజల మైండ్ వాష్ చేసేందుకే పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన ఏర్పాటు చేసిందన్నారు.
గతంలో ఈఆర్సీ వద్ద రైతులు గొడవ చేస్తే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని చెప్పారని కవిత గుర్తుచేశారు. గృహ విద్యుత్ కనెక్షన్లకు మాత్రం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ట్రాన్స్ కో సీఎండీ చెప్పారన్నారు. సెల్ ఫోన్ ముందస్తుగా రీచార్జ్ చేసుకున్నట్టుగా ఇకపై కరెంట్ కు ముందస్తు చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి స్మార్ట్ మీటర్లతో వస్తుందన్నారు. రీచార్జ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు ఆటోమేటిక్ గా ఇండ్లలో కరెంట్ కట్ అవుతుందని చెప్పారు. యూపీలో స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఆగ్రహంతో వాటిని తొలగించి కరెంట్ ఆఫీసుల్లో పడేసి వెళ్తున్నారన్నారు.
Also Read: కుంభమేళా ఖర్చులో 0.1% చాలు.. వందలాది స్కూళ్లను కాపాడొచ్చు.. సుప్రీంకోర్టు జడ్జి సంచలనం!
ఇప్పుడున్న మీటర్లతోనే కరెంట్ సరఫరా చేయాలని స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రయత్నాలను విరమించుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఆర్టిజన్ లు, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసి కరెంట్ సరఫరా బాగుండేలా చర్యలు చేపట్టాలని కోరారు. మన కరెంట్ ను అదానీ చేతుల్లో పెట్టే ప్రయత్నాలను ఇకనైనా విరమించుకోవాలన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుందని.. ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
Also Read: కొండాకు మరో క్షమాభిక్ష..? ఖర్గేతో రాయబారం ఫలించినట్టేనా..? సీఎం వ్యాఖ్యల వెనుక మర్మం ఇదేనా?