Supreme Court Judge: విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు క్రమంగా తగ్గిపోతుండటం, మరాఠీ స్కూల్స్ మూతపడుతుండటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి. వరాలే (Prasanna B. Varale) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నాసిక్ కుంభమేళాకు రూ. వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం.. అందులో అత్యల్ప మొత్తాన్ని కేటాయించినా వందలాది మరాఠీ పాఠశాలలను మూతపడకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘స్మార్ట్ క్లాసెస్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాసిక్-త్రయంబకేశ్వర్ సింహస్థ కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం దాదాపు రూ.32,000 కోట్ల నుంచి రూ.34,000 కోట్ల వరకు బడ్జెట్ కేటాయిస్తోందని జస్టిస్ వరాలే అన్నారు. వివిధ కారిడార్ ప్రాజెక్టులకు రూ.11,000 కోట్లు వెచ్చిస్తోందని గుర్తుచేశారు. ఈ ఆధ్యాత్మిక వ్యయంలో కేవలం 0.1 శాతం అంటే సుమారు రూ.32 కోట్లు విద్యారంగానికి కేటాయించి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన 100 నుంచి 125 మరాఠీ మీడియం పాఠశాలలకు పునరుజ్జీవం లభించేదని ఆయన పేర్కొన్నారు.
తాను 10వ తరగతి వరకు మున్సిపల్, జిల్లా పరిషత్ మరాఠీ మీడియం పాఠశాలల్లోనే చదువుకున్నానని జస్టిస్ వరాలే తెలిపారు. మాతృభాష లేదా ప్రాంతీయ భాషల్లో విద్యనభ్యసించడం తన వృత్తిపరమైన ఎదుగుదలకు ఎప్పుడూ అడ్డంకిగా మారలేదన్నారు. అది తన ఆలోచనా పరిధిని మరింత విసృతం చేసిందన్నారు. ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ అనేవి ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని అన్నారు. పాఠశాలల్లో పిల్లలకు కనీస వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.
Also Read: జాయ్ రైడ్లో ఊడిన సేఫ్టీ లాక్.. గాల్లోంచి కిందపడ్డ యువతి.. షాకింగ్ వీడియో!
దేశంలో విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నప్పటికీ విద్యాశాఖ బడ్జెట్ మాత్రం పెరగకపోగా క్రమంగా తగ్గుముఖం పడుతోందని సుప్రీంకోర్టు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి 13 శాతం కేటాయింపులు కూడా దాటకపోవడం విచారకరమన్నారు. ఇటీవల ఓ స్కూల్లో సరైన గదులు, మౌలిక వసతులు లేకపోవడంతో నేలపై పడుకున్న ముగ్గురు విద్యార్థినులు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చూపే శ్రద్ధను పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యారంగంపై కూడా చూపాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: కామెడీతో పాటు ఎమోషన్స్.. ఓజీ డైలాగ్స్ తో ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్!