America Vs Iran: పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? ఆధిపత్యం పోరులో ఇరాన్-అమెరికాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయా? ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు ఒకరు అవునంటే.. మరొకరు నో అంటున్నారు? దీంతో గల్ఫ్లో పరిస్థితి మొదటికి వచ్చిందా? రేపటి రోజున ఏం జరుగుతోంది? ట్రంప్ నిర్ణయం వెనుక కారణం అదేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇరాన్ను దెబ్బకొట్టిన ట్రంప్.. చర్చలకు నో
పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా దేశాల మధ్య శాంతి చర్చలకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇస్లామాబాద్ వేదికగా ఇరుదేశాల మధ్య శనివారం జరగాల్సిన శాంతి చర్చల కోసం వెళ్లాల్సిన తన ప్రతినిధుల బృందం పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేశారు.
ఈ చర్చలు ఎలాంటి ఫలితం ఇవ్వవని భావించారు. చివరకు చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్ తో చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం ఇస్లామాబాద్ చేరుకోవాల్సి వుండగా, చివరి నిమిషంలో ఆ టీమ్ పర్యటనను నిలిపి వేశారు ట్రంప్. ఫలితం లేని చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేయడం అవసరం లేదన్నారు.
ఇరాన్ నాయకత్వంలో సంక్షోభం? మొజ్తబా ఖమేనీకి లేఖ రాసిన నేతలు
ఫలితం లేని చర్చల వల్ల సమయం వృథా అని వ్యాఖ్యానించారు. మా దగ్గర అన్నిదారులు సిద్ధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రస్తావించారు. కావాలనుకుంటే ఇరాన్ నేతలు చర్చలు జరపాలని అనుకుంటే నేరుగా మాకు ఫోన్ చేయవచ్చని వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ పరిణామాలు జరిగిన కాసేపటికి ట్రంప్ మరొక ప్రకటన చేశారు.
ఇరాన్ నుంచి తమకు కొత్త శాంతి ప్రతిపాదన వచ్చిందన్నారు. అయితే దాన్ని తిరస్కరించినట్టు తెలిపారు. మరొక ప్రతిపాదన కాస్త మెరుగ్గా ఉందన్నారు. అయితే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇరాన్ నాయకత్వంలో అంతర్గత కలహాలు ఉండవచ్చని సూచనప్రాయంగా చెప్పారు.
మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరోసారి ఇస్లామాబాద్ వెళ్తారని ఆదేశ ప్రభుత్వ వార్త సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అటు ఇరాన్లో రాజకీయ నాయకత్వం-ఐఆర్జీసీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ALSO READ: వైట్హౌస్లో కాల్పుల కలకలం.. మీడియా మిత్రులకు డిన్నర్, సురక్షిత ప్రాంతానికి ట్రంప్
ఐఆర్జీసీ తీరుని వ్యతిరేకిస్తూ సీనియర్ రాజకీయ నేతలంతా కలిసి ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీకి లేఖ రాసినట్టు అందులోని సారాంశం. ఇరాన్ అధ్యక్షుడు, స్పీకర్, విదేశాంగమంత్రి సంతకాలు చేసినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకత్వం తన వ్యూహాలను మార్చుకోవాల్సి ఉంటుందని, ఆర్థికంగా కుప్పకూలకుండా ఉండాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రస్తావించారట.
ప్రభుత్వంపై ఐఆర్జీసీ మితిమీరిన ప్రభావం చూపుతోందని, పాలనలో సైన్యం జోక్యం తగ్గించాలని కోరినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ చర్చల ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడడంతో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా? అన్న ప్రశ్న రైజ్ అవుతోంది.