Trump Statement: ఇరాన్ యుద్ధం పేరుతో ప్రతీరోజూ వార్తల్లోకి వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. యుద్ధం విషయంలో తెర వెనుక ఏం జరుగుతుందో తెలీదు. రెండు రోజులు కాల్పులు జరిగితే.. మరో రెండురోజులు కాల్పుల విరమణ పాటిస్తున్నామని చెబుతున్నారు. ఈసారి ఏకంగా ఓ అడుగు ముందుకేశారు అధ్యక్షుడు ట్రంప్. త్వరలో హోర్మూజ్ జలసంధిపై అమెరికా జెండా ఎగురవేస్తామన్నారు.
ఇరాన్ను ఓడించిన తర్వాత హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటన చేస్తామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ను పూర్తిగా ఓడించడం పూర్తి చేశాక అతి త్వరలో హోర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తామన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని ఓ పోలీస్ అకాడమీలో జరిగిన రాజకీయ ర్యాలీలో పాల్గొన్న ఆయన, ఈ వ్యాఖ్యలు చేశారు. జలసంధి విషయంలో అమెరికా-ఇరాన్ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.
ఇరాన్ పౌర నౌకాయానం ప్రవేశాన్ని నిరాకరిస్తోంది. ఆదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది అమెరికా నౌకాదళం. మేము దిగ్బంధం విధించామని, మేము కోరుకుంటే తప్ప ఏ ఓడలు లోపలికి రావని అన్నారు. ప్రపంచ ఇంధన రవాణాలో కీలకపాత్ర పోషించే ఈ జలమార్గం మాదేనని ట్రంప్ ప్రకటనపై చర్చ మొదలైంది. హర్మూజ్ను ఎలా ప్రకటిస్తారన్న దానిపై ఎలాంటి వివరాలు చెప్పలేదు. దీనికి చట్టపరమైన ఎలాంటి ఆధారం ఆయన బయటపెట్టలేదు.
అమెరికా సైనిక చర్యల కారణంగా ఇరాన్ నౌకా-వైమానిక దళాలు దెబ్బ తిన్నాయని చెప్పుకొచ్చారు. తమ సైనికులు విజయవంతమయ్యారని చెప్పలేదని, అదే సమయంలో ఇరాన్ ఏ విధంగా డ్యామేజ్ అయ్యిందో తెలుసన్నారు. ఇరాన్కు చెందిన మొత్తం 159 నౌకలు సముద్రంలో మునిగిపోయినట్టు వివరించారు. ఆ దేశానికి చెందిన మరో 212 విమానాలు పూర్తిగా ధ్వంసం అయినట్టు వివరించారు. ఇరాన్ వద్ద ఉన్న విమానాల్లో కొన్ని అమెరికా నుంచి కొనుగోలు చేశారని వ్యాఖ్యానించారు.
ALSO READ: తెల్లవారుజామున ఇండోనేషియాలో భారీ భూకంపం.. 7.7 గా నమోదు, సునామీ హెచ్చరిక జారీ
ఇరాన్ నాయకత్వం దాదాపుగా దెబ్బతిందని, కీలక నాయకులు వరుసగా మృతి చెందారని చెప్పుకొచ్చారు. చర్చలు జరిపేందుకు సరైన నాయకత్వం లేకపోవడం సమస్యగా మారిందని, ఇరాన్ వద్ద కొన్ని క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయన్నారు. రాడార్ వ్యవస్థలు, నిఘా సామర్థ్యాలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ట్రంప్ వాదనను ఇప్పటికే తోసిపుచ్చింది ఇరాన్. కేవలం ఒక ప్రకటన లేదా సైనిక బలగాలతో జలమార్గాన్ని స్వాధీనం చేసుకోవడం సాధ్యంకాదని ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది తెలిపారు.