Trump Palestine Gaza | ఇజ్రాయెల్ 15 నెలలపాటు చేసిన భీకర దాడులతో గాజా ప్రాంతం పూర్తిగా అతలాకుతలమైంది. భారీ స్థాయిలో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఫలితంగా గాజాలో లక్షలాది మంది పాలస్తీనా వాసులు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం, ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గాజా శరణార్థుల పునరావాసానికి సంబంధించి ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. గాజాలో నివసించలేని పరిస్థితుల్లో ఉన్న పాలస్తీనా వాసులు గాజా ప్రాంతానికి పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో తాత్కాలిక పునరావాసం పొందాలని సూచించారు.
‘‘గాజా ప్రాంతం నాశనమైందని, ప్రజలు నివసించడానికి ఇళ్లు, మౌలిక వసుతులు లేక ఇబ్బందులుపడుతున్నారు. ఈ పరిస్థితిలో వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు సహకరించాలి. ఆ దేశాల్లో గాజా వాసులకు ఆశ్రయం కల్పించాలి. వారి కోసం కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇది తాత్కాలిక పునరావాసంగా ఉండవచ్చు లేదా దీర్ఘకాలికమైనా కావచ్చు’’ అని అన్నారు.
Also Read: అమెరికాలో భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.. ట్రంప్ నిర్ణయాలే కారణమా?
ఇప్పటికే, జోర్డాన్ రాజు అబ్దుల్లా-IIతో ఫోన్ ద్వారా ఈ ప్రతిపాదనను ప్రస్తావించినట్లు ట్రంప్ తెలిపారు. అలాగే, ఈజిప్టు అధ్యక్షుడితోనూ ఈ అంశంపై చర్చించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనలపై ఈజిప్టు, జోర్డాన్ల నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది. యుద్ధసమయంలోనే గాజాల వాసులు ఈజిప్ట్ దేశంలో ప్రవేశించకుండా ఆ దేశం గాజా సరిహద్దులను మూసివేసింది. దీంతో ట్రంప్ చేసిన సూచనలు అంత ఈజీగా కార్యరూపం దాల్చే అవకాశం లేదు.
జోర్డాన్ దేశంలో పాలస్తీనా శరణార్థుల పరిస్థితి
ఐక్యరాజ్యసమితి (UN) ప్రకారం, ప్రస్తుతం జోర్డాన్లో సుమారు 24 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. అమెరికా దశాబ్దాలుగా ‘‘ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యకు ద్విదేశ పరిష్కారమే మార్గం’’ అని చెప్పుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ట్రంప్ సూచనలను వ్యతిరేకించిన హమాస్
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన సూచనలను హమాస్, పాలస్తీనావాసులు వ్యతిరేకించారు. ‘‘గాజా ప్రజలు 15 నెలలుగా తీవ్రమైన విధ్వంసాన్ని, మారణకాండను ఎదుర్కొన్నారు. కానీ, వారు తమ గృహాలను విడిచి వెళ్లడం లేదు. ట్రంప్ ప్రతిపాదనలు మంచి ఉద్దేశంతో చేసి ఉండవచ్చు.. కానీ గాజా స్థానికులు వాటిని అంగీకరించబోరు’’ అని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బస్సెం నయీమ్ పేర్కొన్నారు.
అమెరికా అక్రమ వలసదారుల వైఖరిపై బ్రెజిల్ మండిపాటు
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను గుర్తించి, ప్రత్యేక విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు. కానీ ఆ విమానాల్లో అక్రమ వలసదారులను నేరస్తులను బంధించి తీసుకెళ్లినట్లు సాగనంపుతున్నారు. దీంతో బ్రెజిల్, కొలంబియా దేశాల ప్రభుత్వం అమెరికా తీరును ఖండించాయి.
‘‘కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను మా దేశంలోకి ప్రవేశించనివ్వము’’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అన్నారు. వలసదారులను గౌరవంగా పంపించే విధానాలను అమెరికా అనుసరించాల్సి ఉందని, అప్పుడే వాటిని అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బ్రెజిల్ ఆగ్రహం
అక్రమ వలసదారులపై అమెరికా విధానంపై బ్రెజిల్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడం వారి మానవ హక్కుల ఉల్లంఘన’’ అని బ్రెజిల్ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తీరును తీవ్రంగా పరిగణిస్తామని తెలిపింది.
అక్రమంగా అమెరికాలో ప్రవేశించి నేరాలకు పాల్పడిన వలసదారులను అమెరికా పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఇప్పటివరకు 538 మందికి పైగా అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.